తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి.
తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి సంసారపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు మరే ఇతర నటీమణులూ పోషించనలేరు అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా అపజయ మెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే... తెలుగు సినీ అభిమానుల లావణ్యరాశి... నిప్పాణి జమున. ఆగస్టు 30 (1936) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జమున సినీ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం...
బాల్యం అడుగుజాడలు...
జమున పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్యపట్టణం హంపిలో. ఆమె మాతామహులు వెంకటప్పయ్య విజయనగర సంస్థాన ఆస్థాన విద్యాంసులు. పితామహులు నరసింగరావు న్యాయవాది. తల్లి కౌసల్యాదేవి హరికథాభాగవతారిణి, సంగీత విద్యాంసురాలు. తండ్రి శ్రీనివాసరావు విద్యాధికుడు, వ్యాపారవేత్త. ఆయన పసుపు, పత్తి వంటి వాణిజ్య పంటలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడం వల్ల జమున కుటుంబం ఆ గ్రామానికి వలసవచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవారు.
చిన్నతనంలోనే దుగ్గిరాల రావడం వల్ల జమున తెలుగు అమ్మాయిగానే పెరిగింది. ఆ ఊరులోనే బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునకు కూడా లలిత కళలమీద ఆసక్తి పెరిగింది. స్కూలు వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ప్రదర్శించిన దిల్లీ చలో అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు సుంకర-వాసిరెడ్డి నాటకం మాభూమిలో నటించే అవకాశం వచ్చినప్పుడు, బుర్రకథా పితామహుడు నాజర్ శిక్షణ ఇవ్వడం జమున జీవితంలో ఉద్వేగ క్షణాలు! అందులో నరక కూపమీ క్రూర నైజాం పాలన రైతన్నా అనే పాటను ఆలపించి ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు అందుకుంది. అదే నాటకాన్ని తెనాలి, విజయవాడ పట్టణాలలో ప్రదర్శిస్తే జమున కూడా ఆ బృందం వెంట వెళ్లి నటించి పేరు తెచ్చుకుంది. ఒకసారి తెనాలి సమీపంలోని మండూరులో దిల్లీ రాజ్యపతనం నాటకం వేయాల్సి వచ్చినప్పుడు, స్థానిక హైస్కూలులో టీచరుగా పని చేస్తున్న కొంగర జగ్గయ్య (ప్రఖ్యాత సినీనటులు) జమునను భుజాల మీద ఎక్కించుకొని తీసుకు వెళ్లడం జమున జీవితంలో మరపురాని సంఘటన.
సినిమా నటనపై ఆసక్తి
జమున బంధుమిత్రులు ఆమె తల్లితో అమ్మాయిని సినిమాల్లో చేర్పించండి, రాణిస్తుంది అంటూ సలహా ఇస్తుండేవారు. తల్లి విని వూరుకుండేది. కానీ జమున మనసులో సినిమాల్లో నటించాలనే బీజం తెలియకుండానే నాటుకుంది. జమున కౌమారదశకు చేరుకుంటున్నప్పుడు దుగ్గిరాల నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్నారాయణ వంటి నాయకులు వచ్చి ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో జమున ప్రార్థనాగీతం పాడింది. అది విన్న శ్రీమన్నారాయణమూర్తి అనే వ్యక్తి ఇంటికి వచ్చి, తను సినిమాల్లో హాస్య పాత్రలు వేస్తుంటానని, జమునను సినిమాల్లో ప్రవేశపెడితే మంచి నటిగా రాణిస్తుందని సలహా ఇచ్చి, అందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తానని సెలవిచ్చి వెళ్లాడు. అతడు అన్న మాటలు జమున ఆశల్ని చిగురింపజేశాయి. జమున పెదతండ్రి ఆర్.ఆర్.నిప్పాణికి స్నేహితులైన గరికపాటి రాజారావుతో జమున కుటుంబానికి పరిచయం కలిగింది. ఆయన రాజమండ్రిలో ఛాయాగ్రాహకుడు వి.ఎన్.రెడ్డితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. జమున ఫొటోలను తీయించి బొంబాయిలో వి.ఎన్.రెడ్డికి పంపారు.
ఈలోగా శ్రీమన్నారాయణమూర్తి సిఫారసుతో బి.వి.రామానందం అనే సినీ నిర్మాత తను నిర్మించబోయే జై వీర బేతాళ అనే సినిమాలో జమునకు నటించే అవకాశాన్ని కలిపించారు. దాంతో జమున కుటుంబం మద్రాసు వెళ్లింది. కోడంబాకంలో ఉన్న స్టార్ స్టూడియోలో షూటింగు మొదలైంది. హీరో గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయనకూ ఇదే మొదటి సినిమా. అయితే కొన్ని రీళ్లు తీశాక జై వీర బేతాళ నిర్మాణం ఆగిపోయింది. ఈలోగా రాజారావు నిర్మించే పుట్టిల్లు సినిమాలో జమున పాత్ర ఖరారైంది. అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు. అందులో హీరో రాజారావు యాభై ఏళ్ల వయసులో ఉండగా, జమున టీనేజి తార కావడం ఒక కారణం కాగా, వ్యసన పరుడైన భర్తను వదిలేసి హీరోయిన్ స్వతంత్ర జీవనం గడపడం ప్రేక్షకులకు నచ్చకపోవడం మరో కారణమైంది. తర్వాత జమునకు సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది సినీ పితామహుడు హెచ్.ఎం.రెడ్డి రోహిణి బ్యానర్పై రెండు భాషల్లో నిర్మించిన వద్దంటే డబ్బు సినిమా. అందులో జమున, పేకేటి శివరాంకు జోడీగా నటించింది. సినిమా బాగా ఆడలేదు. తర్వాత సారథి ఫిలిమ్స్ వారు నిర్మించిన అంతా మనవాళ్లే సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ సినిమా వందరోజులు ఆడింది. అలాగే కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణా వారి తొలి చిత్రం దొంగరాముడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. అంతే... జమున దశ తిరిగింది. ఇక వెనక్కి చూసుకోవాలిసిన అవసరం రాలేదు.
హీరోయిన్గా నిలదొక్కుకుంటూ...