పాత్రలు అమోఘం, గొంతు అద్భుతం.. ఆయనే సాయికుమార్ - సాయికుమార్ కెరీర్
సాయి కుమార్.. ఈ పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగ్లు మన కళ్ల ముందు మెదులుతాయి. టాలీవుడ్లోని ఎన్నో సినిమాలకు ఆయన డబ్బింగ్ ఎంతగానో కలిసి వచ్చింది. ప్రస్తుతం వివిధ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఇలాంటి అద్వితీయ నటుడి 60వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.
![పాత్రలు అమోఘం, గొంతు అద్భుతం.. ఆయనే సాయికుమార్ Sai Kuma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12582601-374-12582601-1627318727156.jpg)
సాయి కుమార్
"చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్" ఈ డైలాగ్ వినగానే సాయికుమార్ మన కళ్లముందు మెదులుతూ ఉంటారు. రజనీకాంత్, సుమన్, రాజశేఖర్ వంటి అగ్రనటులకు తన గొంతును అరువిచ్చి వారి సక్సెస్లో భాగమయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ఉన్నారు. ఈరోజు సాయి కుమార్ 60వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి గురించిన ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే..
- 'పోలీస్ స్టోరీ' విడుదలై 25ఏళ్లు గడిచిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అందరూ అంటున్న పాన్ ఇండియా సినిమాను ఆనాడే 'పోలీస్ స్టోరీ'తో చేసేశాం. నా కెరీర్లో ఆ చిత్రం ఒక మైలురాయి. అంతటి విజయాన్నిచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నా సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు దగ్గరపడుతోంది.
- సినీ పరిశ్రమకు నాన్న పీజే శర్మ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఆయన నాగేశ్వరావుగారికి వీరాభిమాని. కేవలం ఆయన్ను చూసేందుకే జూనియర్ ఆర్టిస్టుగా స్టూడియోకు వెళ్లారట. అలా తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కాలక్రమేణా బిజీ అయ్యారు. కానీ, ఆయన కోరుకున్నంత బ్రేక్ అయితే ఇండస్ట్రీలో లభించలేదు. అందుకే నన్ను కూడా మొదటి నుంచీ బాగా చదువుకుని వేరే రంగంలో స్థిరపడమనేవారు. కానీ, అమ్మ ప్రోత్సహిస్తుండేది. చివరికి ఇదిగో ఇలా ఈ స్థాయిలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.
- ఆది కూడా మొదట క్రికెట్ను కెరీర్ ఎంచుకున్నాడు. ఇందులో నా ప్రోద్బలం కూడా ఉంది. అండర్-19 స్థాయిలో ఆంధ్రా తరఫున ఆడాడు. ఆ తర్వాత నటుడు అవ్వాలనుందని చెప్పడం వల్ల కొన్నాళ్లు వైజాగ్ వెళ్లి సత్యానంద్గారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత విజయ్భాస్కర్.కె డైరెక్షన్లో 'ప్రేమ కావాలి' చిత్రం చేశాడు. దాని ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలోని పెద్దలందరూ వచ్చారు. ముఖ్యంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిగారు ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే మా కుటుంబంలో అందరికి నాన్నగారి బేస్ వాయిస్ వారసత్వంగా రావడం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. తమ్ముడు రవిశంకర్, అయప్ప కన్నడ చిత్రాల్లో బిజీ నటులు. అలాగే కుమారుడు ఆది తనదైన స్టైల్లో నటిస్తున్నాడు. ఆది, చిరంజీవి, సాయికుమార్, సురేఖ
- అమ్మ గారిది కర్ణాటక- ఆంధ్రా బోర్డర్లో ఉన్న బాగేపల్లి. ఆ క్రమంలోనే ఆమె కొన్ని కన్నడ సినిమాల్లో రాజ్కుమార్ వంటి సూపర్స్టార్స్ సరసన నటించింది. అలా ఆమె ప్రభావం నాపై ఉండటం వల్ల కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. కన్నడ ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదిరిస్తారు. నా మొదటి కన్నడ సినిమాకు డబ్బింగ్ వేరేవాళ్లు చెప్పటం విశేషం. ఇప్పుడు నా వాయిస్కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కన్నడలో హీరోగా వచ్చినంత బ్రేక్ తెలుగులో నాకు దక్కలేదనుకుంటున్నా.
- నా కెరీర్లో 'పోలీస్స్టోరి' తర్వాత 'ప్రస్థానం' రూపంలో అతిపెద్ద బ్రేక్ వచ్చింది. అలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుంటుంది. అలాగే కన్నడలో నటించిన 'రంగి తరంగి' సినిమాలో నా పాత్రకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అస్కార్ నామినేషన్స్ వరకు కూడా సినిమా వెళ్లింది. యక్షగాన బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఈ సంవత్సరం కన్నడలో నా సినిమాలు 10 విడుదలవుతున్నాయి. తెలుగులో చేసిన 'శ్రీకారం' ఎంతో సంతృప్తినిచ్చింది. త్వరలోనే 'పోలీస్ స్టోరీ' సీక్వెల్ను 'నాలుగో సింహం' పేరుతో అన్ని భాషల్లో అదే టీమ్తో నిర్మించబోతున్నాం.
- తెలుగులో వచ్చిన 'పటాస్' సినిమా కన్నడ రీమేక్ ద్వారా ఆదిని శాండల్వుడ్కి పరిచయం చేద్దామనుకున్నా. కానీ మొదటి సినిమానే పోలీస్ పాత్రలో నటించడం అంత సూట్ కాదమోనని ఆదినే వెనక్కి తగ్గాడు. లేకుంటే ఒక మంచి గ్రాండ్ ఎంట్రీ అక్కడ దక్కేదేమో అని భావిస్తుంటా.
- ఇక నా రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే వెంకయ్యనాయుడి గారి ఆశీస్సులతో భాజపాలో చేరాను. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున స్టార్ క్యాంపెనర్గా తిరిగాను. అమ్మకోరిక మేరకు 2008లో బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొద్దిలో ఓటమి పాలయ్యా. ఆ తర్వాత పిల్లల కెరీర్ దృష్టిలో పడి ఆ నియోజకవర్గానికి దూరమయ్యా. మోదీగారితో అప్పట్లో సన్నిహిత సంబంధాలుండేవి.