తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్(Milkha Singh). భారత కీర్తి పతాకాన్ని విశ్వ వేదికపై ఎగురవేసిన ఈ ఫ్లయింగ్ సిక్కు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా నివాళులు అర్పించి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు పలువురు సినీ ప్రముఖలు.
"గుండె పగిలే వార్త ఇది. ఈ రోజు ఓ లెజెండ్ను కోల్పోయాం. స్వాతంత్ర్యం తర్వాత భారత్ ఎలా ముందుకు నడవాలో ఆలోచిస్తుంటే, మీరు పరుగెత్తడం నేర్పించారు. పెద్ద కలలను కనడం, ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించి కలలను ఎలా సాకారం చేసుకోవాలో నేర్పారు. రాబోయే తరాలన్నింటికీ మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. మీరెప్పుడు మా హీరో. దేశం ఎప్పుడు మిమల్ని గుర్తుపెట్టుకుంటుంది, మీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది."
-బాలకృష్ణ, టాలీవుడ్ స్టార్ హీరో
"మిల్కాసింగ్ ఇక లేరు. దేశం గర్వించదగ్గ గొప్ప అథ్లెట్, గొప్ప మనిషి"
-అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ దిగ్గజ నటుడు.
"ది ఫ్లైయింగ్ సిక్కు మనతో లేకపోయినా ఆయన ఉనికి ఎప్పటికీ ఉంటుంది. ఆయన నాతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా సార్."
-షారుక్ ఖాన్, బాలీవుడ్ నటుడు.
"మీరు లేరనే నిజాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను. మీరెప్పుడు జీవించే ఉంటారు. ఇదే నిజం. మీరెంతో మంచివారు, గొప్పవారు. కఠోర శ్రమ, పట్టుదల, నిజాయతీ పట్టుదలతో ఆకాశమంత ఎత్తుకు ఎదగొచ్చని మీరు నిరూపించారు. మీరు ఎందరికో స్ఫూర్తి ప్రదాత."
-ఫర్హాన్ అక్తర్, బాలీవుడ్ నటుడు.
ప్రియాంక చోప్రా, తాప్సీ, సీనియర్ నటి షబానా అజ్మి, సన్నీ దేఓల్, రితేష్ దేశముఖ్, దర్శకుడు మధుర్ భందార్కర్ సహా పలువురు నటులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1932 నవంబర్ 20న పంజాబ్ (పాకిస్థాన్) గోవింద్పురలోని సిక్కు రాఠోడ్ రాజపుత్రుల కుటుంబంలో మిల్కాసింగ్ జన్మించారు. ఆ తర్వాత మనదేశానికి వలస వచ్చి, క్రీడా ఆణిముత్యంగా కీర్తి గడించారు. పరుగుల పోటీల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో బ్రిటీష్ ప్రభుత్వం, కామన్వెల్త్ పోటీల్లో అరుదైన ఘనత సాధించారు. 46.6 సెకన్లలో 400 మీటర్లు పరుగెత్తి స్వర్ణం గెలిచిన మిల్కా.. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 1959లో కేంద్ర ప్రభుత్వం మిల్కాసింగ్కు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'భాగ్ మిల్కా భాగ్'. మిల్కా సతీమణి నిర్మల్ కౌర్ గతవారం కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఇదీ చూడండి: మిల్కాకు ప్రధాని, రాష్ట్రపతి నివాళి