తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2021, 8:07 PM IST

ETV Bharat / sitara

అర్జున్​గా మొదలై.. భళ్లాలదేవగా సంచలనం

సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా. హీరోగానే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ మెప్పించారు. అవసరమనుకుంటే అది ఎన్ని నిమిషాలైనా అతిథి పాత్రకి ఎప్పుడూ ఓకే అంటారు. ఈ ఆరడగుల కటౌట్‌ ప్రేక్షకులకు పరిచయమై శుక్రవారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన సినీ ప్రయాణం ఎలా సాగిందో ఓ సారి చూద్దాం..

Rana Daggubati finishes 11 years in cinema industry
అర్జున్​గా మొదలై... భల్లాలదేవగా సంచలనం

దిగ్గజ నిర్మాత రామానాయుడి మనవడు, తండ్రి నిర్మాత, బాబాయ్ అగ్ర కథానాయకుడు. మరి ఇలాంటి కుటుంబం నుంచి ఓ వ్యక్తి చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడంటే అటు సినీ వర్గాలు.. ఇటు ప్రేక్షకులు భారీ బడ్జెట్‌లో యాక్షన్‌ సినిమా ఆశిస్తారు. దానికి పూర్తి భిన్నంగా 'లీడర్‌' చిత్రంతో రాజకీయ నాయకుడిగా పరిచయమయ్యాడు రానా. వసూళ్ల మాట ఎలా ఉన్నా రానా నటనకు మంచి మార్కులే పడ్డాయి. యువ ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకున్నారు. అర్జున్‌ ప్రసాద్‌ అనే పాత్ర పోషించారు. రానాను పరిచయం చేసే అవకాశం శేఖర్‌ కమ్ములకు దక్కింది. 2010 ఫిబ్రవరి 19న విడుదలైందా సినిమా.

రానా దగ్గుబాటి
  • తెలుగులో రెండో సినిమాకు ప్రేమకథను ఎంచుకున్నారు. అదే 'నేను నా రాక్షసి'. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఇలియానా నాయిక. తనలోని రొమాంటిక్‌ కోణాన్ని ఆవిష్కరించారు. ఈ విభిన్న ప్రేమకథలో అభిమన్యు అనే పాత్రలో కనిపించారు రానా.
  • ప్రకాశ్‌ తోలేటి దర్శకత్వంలో 'నా ఇష్టం' అనే మరో లవ్‌స్టోరీ ఎంపిక చేసుకున్నారు. జెనీలియా కథానాయిక. ఈ సినిమాలో గనిగా కనిపించారాయన.
  • రానాలోని అసలైన నటుడ్ని బయటకు తీసుకొచ్చిన చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బీటెక్‌ బాబుగా రానా నటన అద్భుతంగా నిలుస్తుంది.
  • కేవలం రానా, ప్రభాస్‌కు మాత్రమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకే కీర్తి తీసుకొచ్చింది 'బాహుబలి'. 2015లో వచ్చిన ఈ సినిమా రానా కెరీర్‌ గ్రాఫ్‌ని ఒక్కసారిగా మార్చేసింది. భళ్లాల దేవ: ప్రతినాయక పాత్ర అయినా రానా ఓకే చెప్పడం విశేషం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పాత్రనే ఇంటి పేరుగా మార్చుకున్నారు.
  • అనుష్క ప్రధాన పాత్రధారిగా చరిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ‘రుద్రమ దేవి’ సినిమాలో చాళుక్య వీరభద్రగా తనదైన నటన ప్రదర్శించి ఔరా అనిపించారు. ఆర్య, బాబీ సింహా హీరోలుగా తెరకెక్కిన తమిళ చిత్రం 'బెంగళూరు నాట్కల్' అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు.
  • 'బాహుబలి' తర్వాత రానా చేసిన మరో సాహసం 'ఘాజీ' కథానాయిక లేదు, పాటలు లేవు, ఫైట్లు లేవు.. కథే అన్నీ అనుకుని చేసిన ఈ ప్రయోగం రానాని మరోస్థాయికి తీసుకెళ్లింది. నేవీ అధికారి అర్జున్‌ వర్మ పాత్రలో ఒదిగిపోయారు. సంకల్ప్‌ రెడ్డి దర్శకుడు.
  • తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రానాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం తెచ్చిపెట్టింది. రాధా జోగేంద్రగా రానా నట విశ్వరూపం చూపించారు.
  • నందమూరి తారక రామారావు జీవితాధారంగా వచ్చిన 'ఎన్టీఆర్‌: కథానాయకుడు'లో చంద్రబాబునాయుడి పాత్ర పోషించి ఆశ్చర్యంలో పడేశారు. ధనుష్‌, మేఘా ఆకాశ్‌ జంటగా తెరకెక్కిన 'ఎనై నొకి పాయుమ్‌ తోట'లో ప్రత్యేక పాత్ర పోషించారు.

అతిథిగా..

  • సిద్దార్థ్‌, హన్సిక జంటగా తెరకెక్కిన 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'లో ప్రత్యేక పాత్రలో కనిపించారు.
  • అజిత్‌ హీరోగా వచ్చిన తమిళ చిత్రం 'ఆరంభం'లో ఏసీపీ పాత్ర పోషించారు.
  • లక్ష్మీ మంచు, అడివి శేష్‌ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన 'దొంగాట' చిత్రంలో తళుక్కున మెరిశారు.
  • అనుష్క, ఆర్య జంటగా వచ్చిన 'సైజ్‌ జీరో'లో అతిథిగా కనిపించారు.

బాలీవుడ్‌ మెరుపులు..

  1. 'ధమ్‌ మారో ధమ్‌' అనే హిందీ చిత్రంలో మెరిశారు రానా. అభిషేక్‌ బచ్చన్‌, బిపాసా బసు, ఆదిత్య పాంచోలీ తదితరులు ప్రధాన తారాగణంగా 2011లో వచ్చిందా చిత్రం.
  2. మరోసారి డిపార్ట్‌మెంట్‌ అనే హిందీ సినిమాలో సందడి చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, సంజయ్‌ దత్‌ వంటి అగ్ర నటులతో తెరను పంచుకుని బాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్‌ పెంచుకున్నారు.
  3. రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణె, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'యే జవానీ హై దీవానీ' సినిమాలో అతిథి పాత్ర పోషించారు.
  4. 'బేబీ' అనే చిత్రంలో అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించారు.
  5. రితేశ్‌ దేశ్‌ముఖ్‌, బొమన్‌ ఇరానీ తదితరులు నటించిన 'వెల్‌కమ్ టు న్యూయార్క్‌' చిత్రంలో అతిథిగా కనిపించారు.
  6. 'హౌజ్‌ఫుల్‌ 4'లో అక్షయ్‌ కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌తో కలిసి సందడి చేశారు.

త్వరలో..

అడవి నేపథ్యంలో రానా కథానాయకుడిగా తెరకెక్కిన 'అరణ్య' విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్చి 26న రాబోతుంది. ప్రభు దర్శకుడు. బందేవ్‌ అనే పాత్ర పోషించారు రానా.

కామ్రేడ్‌ రవన్నగా రానా నటించిన 'విరాటపర్వం' ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఊడుగుల దర్శకుడు.

పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. సాగర్‌ కె చంద్ర దర్శకుడు. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్' సినిమాకు రీమేక్‌గా రూపొందుతుంది.

ఇదీ చదవండి:అలరిస్తోన్న 'సూరారై పొట్రు' డిలిటెడ్ సీన్

ABOUT THE AUTHOR

...view details