నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బంధుప్రీతి, డ్రగ్స్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయమై స్పందించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించింది. దీనికోసం సుశాంత్ ఆత్మహత్యను ఓ అస్త్రంలా ఉపోయోగిస్తున్నారని పేర్కొంది. ఇవి కనికరంలేని దాడులని అభివర్ణించింది.
కొంతమంది సుశాంత్ మరణాన్ని ఓ సాధనంలా వినియోగిస్తూ చిత్రసీమను, అందులోని వ్యక్తుల గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తున్నారు. ఇండస్ట్రీ అంటేనే ఓ భయంకర ప్రదేశం, బెదరింపులకు, క్రూరత్వానికి అడ్డా అనేలా చిత్రీకరిస్తున్నారు. చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే ఉన్నారు. ఇటువంటి వాటికి యావత్ పరిశ్రమనే తప్పుగా చూపించే ప్రయత్నాలు చేయడం సరికాదు. ఎన్నో వేలమంది కార్మికులకు, రవాణా, పర్యాటక రంగాలకు అండగా నిలిచి దేశానికే గర్వకారణంగా నిలిచింది. సాహితీవేత్తలు, కవులు, గాయకులు, నటులు ఇలా ఎంతో మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దింది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆదుకుంది. నెపోటిజమ్కు ఇక్కడ చోటులేదు. ఏ వ్యక్తికి అయినా ప్రతిభతో గుర్తింపు దక్కుతుంది. కెరీర్లో ముందుకు సాగుతాడు.