నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్స్టోరీ'. నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సి.హెచ్ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
*శేఖర్ కమ్ముల శైలిలో సాగే ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందించాం. ఇందులో ప్రేమకథతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటన్నది తెరపైనే చూడాలి. ఇలాంటి సినిమాలు థియేటర్లలో చూస్తేనే ఆ అనుభూతి తెలుస్తుంది. ఆంధ్రాలోని సమస్యలు ఈనెల 20కల్లా ఓ కొలిక్కి వచ్చినా రాకున్నా.. 24వ తేదీకి పక్కాగా విడుదల చేయాలని ముందే ఫిక్సయ్యాం. ప్రస్తుతం ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ దృష్టిలో పెట్టుకుని.. ఆటల టైమింగ్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అక్కడా నాలుగు షోలు పడేలా ప్లాన్ చేసుకుంటున్నాం.
* శేఖర్ కమ్ములతో ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం మోహన్లాల్తో పాటు తెలుగు, హిందీ చిత్రసీమల నుంచి కొందరి పేర్లును పరిశీలిస్తున్నాం.