తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి సినిమాకే సాహసం చేసిన రామానాయుడు - Daggubati Ramanaidu

టాలీవుడ్​లో ఎంతోమంది కొత్త నిర్మాతలు తొలి చిత్రంతోనే మంచి విజయాలను అందుకున్నారు. కానీ, డబ్బుతో పాటు మంచి పేరును సంపాదించున్న వారిలో దగ్గుబాటి రామానాయుడు ముందుంటారు. ఎందుకంటే ఆయన నిర్మించిన చిత్రం హిట్​ అయినా.. ఫ్లాప్​ అయినా ప్రొడక్షన్​లో పని చేసిన ప్రతి వ్యక్తికి వెంటనే డబ్బు ఇచ్చేవారట. అలాంటి దక్షతగల నిర్మాతలు ఆధునిక కాలంలో చాలా తక్కువ మంది ఉంటారు. నేడు (జూన్​ 6) ఆయన జయంతి సందర్భంగా రామానాయుడు జీవితంలోని కొన్ని విశేషాలు.. నటుడు, రచయిత రావి కొండలరావు మాటల్లో.

Producer Daggubati Rama Naidu Birth Anniversary Special Story
కథల ఎంపికలో అభిరుచి.. నిర్మాణంలో దక్షత గల నిర్మాత

By

Published : Jun 6, 2020, 5:16 AM IST

ఒకటా... రెండా?... ఎన్ని సినిమాలు! ఎన్ని ప్రశంసలు! ఎన్ని భాషలు?.. ఆయనకు ఉన్నది పట్టుదల. అది నెరవేరడానికి దీక్ష. కార్యదక్షత ఆయన సంకల్ప బలం. ఇలాంటివెన్నో రామానాయుడి దగ్గర గ్రహించాలి. ముఖ్యంగా సినిమాలు నిర్మించాలని పరిశ్రమలోకి వచ్చే వారందరికీ ఈయన జీవితం, కచ్చితంగా చదవాల్సిన పుస్తకంలాంటింది. ఓ సినిమా హిట్టయితే పొంగిపోలేదు. ఫట్టయితే గట్టుమీద చతికిలబడి కుంగిపోలేదు. 'రాముడు భీముడు' (1964) నుంచి నిరంతరం ఒకటే శ్రమ, నిజాయితీ, ఆలోచన, చిరునవ్వు. వ్యాపారం చేసేందుకు ఇండస్ట్రీ అనుకూలంగా ఉన్న రోజులవి. చిత్తశుద్ధితో.. ప్రణాళికతో.. అవగాహనతో.. సినిమా తీస్తే నష్టం రాని రోజులవి. 'అనురాగం' సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేరి, అసలు సినిమా ఎలా తీస్తారు? అనే విషయాలను పూర్తిగా గ్రహించిన తర్వాతే సొంతంగా సినిమా తీయడం ప్రారంభించారు రామానాయుడు. నేడు (జూన్​ 6) ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

దగ్గుబాటి రామానాయుడు

తొలి చిత్రమే సాహసం

తానుగా ఓ భారీ సినిమా తీయాలని రామానాయుడు.. తన కుమారుడు పేరుతో సురేశ్​ ప్రొడక్షన్స్​ స్థాపించారు. చాలా మంది తీయాలనుకుని ధైర్యం చాలక వదిలేసిన ఓ స్క్రిప్ట్‌ తొమ్మిదేళ్లుగా రచయిత నరసరాజు దగ్గరుంది. ఆ విషయం తెలుసుకుని, "నేను ధైర్యం చేస్తాను. తప్పకుండా ఈ కథ కొత్తగా ఉంటుంది" అని భావించి, 'రాముడు - భీముడు' ఆరంభించారు. ఎన్టీఆర్​ను సంప్రదిస్తే డేట్స్‌ ఇచ్చారు. తొలిసారిగా రామారావు ద్విపాత్రాభినయం చేసిందీ సినిమాలోనే. అయితే ఇదీ ఓ ప్లస్‌ పాయింట్ అవుతుంది అని అనుకున్నారు నాయుడు. అలా మొదటి ప్రయత్నమే సాహసవంతమైంది. 'రాముడు-భీముడు'తో సురేశ్​ ప్రొడక్షన్​ సంస్థ విజయపతాకం ఎగురవేసింది. నాయుడు సంకల్ప బలానికి చిహ్నం ఆ చిత్రం.

వెంకటేశ్​తో రామానాయుడు

నిర్మాత అంటే అలానే ఉండాలి

రామానాయుడు.. విజయ నాగిరెడ్డితో కలిసి, విజయ సురేష్‌ పేరుతో కొన్ని సినిమాలు తీశారు. మొదటి సినిమా 'పాపకోసం' (1968) పనిచేశానని నటుడు, రచయిత రావి కొండలరావు చెప్పారు. సిపాయి చిన్నయ్య, ద్రోహి, జీవన తరంగాలు, ముందడుగు, ప్రేమనగర్‌, ఒక చల్లని రాత్రి, ప్రేమఖైదీ, సావాసగాళ్లు - ఇలా ఎన్నో సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే, ఏనాడూ 'నా పారితోషికం ఎంత?' అని అడగలేదు. ఆయనే పంపిస్తారు. ఏ హీరో, హీరోయిన్లో తప్పితే, తక్కిన వాళ్లెవరూ పారితోషికం గురించి మాట్లాడేవారు కాదు. ఆయనే న్యాయంగా ఇస్తారు. నటీనటులకు, టెక్నీషియన్లకు ఎప్పుడూ ఆయన బాకీ పడలేదు. తన సినిమా పరాజయం పొందినా, విజయం సాధించినా అందరికీ సకాలానికి పారితోషికాలు పంపించేసేవారు. అది దక్షతగల నిర్మాతల విధానం! ఎంతో అవసరం వస్తే తప్ప ఎవరూ ఆయన్ని డబ్బు కావాలని అడిగేవారు కాదు.

తనకు నాయుడుతో బాగా చనువు ఏర్పడిన తర్వాత, చాలా సరదాగా చమత్కారాలు చేసేవాడినని చెప్పారు రావి కొండలరావు. ఓసారి ఆఫీసుకు వెళ్లి "మీ ఆటోగ్రాఫ్‌ కావాలి సార్‌" అని‌ పుస్తకం తీశాను. "ఏం ఇప్పుడేం చేస్తావు? ఎందుకూ?" అన్నారు నవ్వుతూ. 'కావాలి' అన్నాను. ఆయన పెన్ను తీశారు. "ఎలాగూ తీశారు గనక, ఆ చేత్తోనే మీ చెక్కుమీద కూడా ఆటోగ్రాఫ్‌ చేయండి" అన్నాను. 'ఓర్నీ...' అని, 'ఏం ఏమిటవసరం?' అని అడిగారు. "అవసరం వచ్చింది. చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను. డబ్బు సరిపోవడం లేదు. ఈ సినిమాలో నేనున్నాను కదా, ఎంత ఇస్తారో అది, ఇచ్చేస్తే చాలు" అన్నాను. 'శుభం' అని నా పారితోషికం ఇచ్చేశారు. 'ముందడుగు' సినిమాలో నాకు వేషం వచ్చింది. వెంటనే ఆఫీసుకు వెళ్లి 'సార్‌ వేషం ఇచ్చారు - సంతోషం. అడ్వాన్స్‌ ఇవ్వండి మరి' అన్నాను. ఒక్కసారి అదొలా చూసి, "అదేమిటయ్యా ఎప్పుడూ లేదు - ఎవరూ అడగరు. అడ్వాన్స్‌ అడుగుతున్నావ్‌?" అన్నారు. "మీరే కదండీ - ముందడుగు అన్నారు. అందుకే ముందుగా అడుగుతున్నాను' అన్నాను. ఆయన గొల్లున నవ్వేశారు. ఏ భేషజంలేని నిర్మాత!

ఏదో ఓ షూటింగ్ కోసం నేను అవుట్‌డోర్‌ వెళ్లాలి. అప్పుడు విజయచిత్ర ఆఫీసులో ఉన్నాను ఎందుకో నాయుడు అటు వచ్చారు. (తరచు వచ్చేవారు. విశ్వనాథరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి అందరూ మిత్రులు 'నువ్వు నువ్వు' అనుకునే వారు) 'నేను లోకేషన్‌కు వెళ్తున్నాను, రా పోదాం' అన్నారు. 'ఎందుకు సార్‌, ప్రొడక్షన్‌ కారు వస్తుంది' అన్నా వినిపించుకోలేదు. తన సొంత, పెద్ద కార్లో పక్కన కూచోపెట్టుకుని లొకేషన్‌కు తీసుకెళ్లారు. పెద్ద, చిన్నా అని లేదు.. ఏ మాత్రం పెద్ద నిర్మాతననే భావన చూపేవారు కాదు.

వెంకటేశ్​, నాగ చైతన్య, రామా నాయుడు

అన్నం పెట్టిన నిర్మాత

చందమామ - విజయకంబైన్స్‌ పేరిట 'బృందావనం, ‘భైరవ ద్వీపం' తీసినప్పుడు సురేశ్​ వారే డిస్ట్రిబ్యూటర్లు. ఆ సమయంలో నేను తరచు నాయుడును కలిసేవాడ్ని. హైదరాబాద్‌ వచ్చాక 'మధుమాసం' సినిమాలో నాకు వేషం ఉందని పిలిచారు. 'ద్రోహి' సినిమాలో వేసిన వేషం ఒకే రోజు. 'దానికేం ఇస్తాం' అనుకుని.. వెండి పళ్లెం, రెండు గ్లాసులు, రెండు గిన్నెలు కొనిపించి పంపించారు. ఎంత మంచి ఆలోచన అనిపించింది! ఆ వేషానికి ఆయన ఎంత ఇచ్చి ఉండేవారోగాని.. ఇవాళ వాటి విలువ కొన్ని వేలు! కాకపోయినా, నాయుడిచ్చిన విలువకట్టలేని గొప్ప జ్ఞాపకం! ఆ వెండి కంచంలో భోజనం చేస్తున్నపుడల్లా ఆయనే గుర్తుకొస్తారు. భోజనం పెట్టిన నిర్మాతగా, ఆ వెండి కంచం కృతజ్ఞతలు చెప్పిస్తూ ఉంటుంది.

- రావి కొండలరావు

ఇదీ చూడండి... ఆ సినిమాలో మహేశ్​, విజయ్​ నటించాల్సింది.. కానీ!

ABOUT THE AUTHOR

...view details