బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి కొందరు హీరోయిన్లు బయటపెట్టిన నిజాలు సంచలనం రేపాయి. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్పై నటి పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేసింది. కశ్యప్ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ చెప్పింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన పాయల్ ట్విట్టర్లోనూ ప్రధానమంత్రి మోదీని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది.
"నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నా. నాకు కథ చెబుతానని అనురాగ్ కశ్యప్ గదిలోకి తీసుకెళ్లాడు. అప్పుడు అతడు 'బాంబే వెల్వెట్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రంలో నటించాలనుకునే అమ్మాయిలు తనతో గడపాలని చెప్పాడు. అతడితో సన్నిహితంగా ఉంటే భవిష్యత్లో ఆఫర్లు వస్తాయని అన్నాడు. సినీ ఇండస్ట్రీలో శారీరక సంబంధం పెద్ద తప్పేమీ కాదన్నాడు. ఆ సమయంలో నన్ను బలవంతం చేయబోయాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు."
-పాయల్ ఘోష్, సినీ నటి