తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆపదలో ఆదుకోవడానికి అన్నయ్య ముందుంటాడు' - pawan kalyan news

కరోనా ప్రభావంతో ఎంతో మంది కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడంలో టాలీవుడ్​ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు. పేద కళాకారులకు వివిధ రకాల సహాయ సహకారాలు అందించిన టాలీవుడ్​ నటులను, దర్శకులను ట్విట్టర్​లో అభినందించాడు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.

Pawankalyan Tweeted About Tollywood Celebrities
'ఆపదలో ఆదుకోవటానికి అన్నయ్య ముందుటాడు'

By

Published : Mar 27, 2020, 10:21 PM IST

సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన చిరంజీవికి తమ్ముడిగా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాపిస్తోన్న తరుణంలో ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పనుల్లేక చాలామంది పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.

ఈ క్రమంలో పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ముందుకు వచ్చి కరోనాపై అలుపెరగని పోరాటాన్ని చేస్తోన్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు విరాళాన్ని ప్రకటించారు. సాయం చేసిన సినీ ప్రముఖులందరినీ పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్​లో అభినందించాడు.

'పెద్దన్నయ్య పెద్ద మనస్సు..'

"సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే నా పెద్దన్నయ్య చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నా. సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాలలోని ప్రతి టెక్నీషియన్‌, ప్రతి కార్మికుడి శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి. సినిమానే నమ్ముకుని జీవిస్తూ కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన చిరంజీవికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను."

ప్రభాస్​ పెద్ద మనసు..

"రూ.4 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించి ప్రభాస్‌ తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేశ్‌బాబు రూ.కోటి ఇచ్చి సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేశాడు. నా అన్న కుమారుడు రామ్‌చరణ్‌.. తన తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ తనకంటూ ఓ సేవాభావాన్ని పెంపొందించుకుంటూ రూ.75 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. మరో యువ శక్తి తారక్‌(ఎన్టీఆర్​) రూ.70 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం ముదావహం."

అల్లుఅర్జున్​ ఆపన్నహస్తం

"తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి విపత్తు వచ్చినా స్పందించే అల్లు అర్జున్‌ రూ.1.25 కోట్లను విరాళంగా అందించి ప్రజల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. సినిమా కుటుంబం నుంచి తొలి విరాళంగా 20 లక్షల రూపాయలను ఇచ్చిన నితిన్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. సినిమా హీరోగా నిలదొక్కుకుంటున్న సాయితేజ్‌ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించి తన బాధ్యతను చాటుకున్నాడు."

దాతృత్వం కలిగిన సినీప్రముఖులు

"మృదుస్వభావి, సృజనాత్మక దర్శకుడు త్రివిక్రమ్‌ రూ.20లక్షలు, సామాజిక స్పృహతో సినిమాలు తెరకెక్కించే కొరటాల శివ, అనిల్‌ రావిపూడి రూ.10 లక్షలు చొప్పున, అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు రూ.20 లక్షలు, సంగీత దర్శకుడు తమన్‌ రూ.5 లక్షలు ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను."

"అదే విధంగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు ముందుగానే జీతాలు ఇచ్చి, సినీ కార్మికుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించడంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన 11మందికి ఆశ్రయం ఇవ్వడం అతనిలోని పెద్ద మనస్సుకు నిదర్శనం. అదే విధంగా తన చిత్రానికి పనిచేస్తున్న 50 మంది సాంకేతిక నిపుణులు, కార్మికులకు రూ.10 వేల చొప్పున తన నిర్మాత సతీశ్‌ వేగేశ్నతో కలిసి ఇచ్చిన హీరో అల్లరి నరేశ్‌, సినీ కార్మికుల కోసం రూ.5 లక్షలు అందించిన దర్శకుడు వి.వి.వినాయక్‌లను అభినందిస్తున్నాను. హీరో రాజశేఖర్‌, నటులు శివాజీ రాజా సినిమా కార్మికులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు." అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. క్రిష్​ దర్శకత్వంలో పవర్​స్టార్ ద్విపాత్రాభినయం​!

ABOUT THE AUTHOR

...view details