మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా అడ్లైన్ క్యాస్టిలినొ మూడో రన్నరప్గా నిలిచింది. అయితే ఈ పోటీల్లో గెలవాలంటే పలు ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అడిగిన చివరి ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆమెపై కామెంట్ల రూపంలో విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి? దానికి ఈ భామ ఇచ్చిన సమాధానమేంటో చూద్దాం..
"కరోనా వల్ల తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ దేశాలు లాక్డౌన్ విధించాలా? లేదా ఆంక్షలను తొలగించి యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించాలా? ఒకవేళ కొనసాగిస్తే కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందా?" అని ప్రశ్న అడిగారు.
"ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితుల ఆధారంగా నేను ఓ ముఖ్యమైన విషయాన్ని గ్రహించా. మనం ప్రేమించే వారి ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఆర్ధిక రంగం, ఆరోగ్యం మధ్య సమతుల్యత ఉండాలి. ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అది దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది" అని సమాధానమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోకు కొద్ది గంటల్లోనే దాదాపు 10వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 'మిస్ ఇండియా గట్టి సమాధానం చెప్పింది', 'ఆమె సమాధానం అద్భుతం' అంటూ కామెంట్లతో ఆమెపై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు.
ఈ పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఆండ్రియా మెజాను వరించింది. జులియా గామా(బ్రెజిల్) తొలి రన్నరప్గా నిలవగా.. జానిక్ మెకెతా(పెరు) రెండో, అడ్లైన్ క్యాస్టిలినొ(భారత్) మూడో, కింబర్లీ రెరెజ్(డొమినిక్ రిపబ్లిక్) నాలుగో రన్నరప్గా నిలిచారు.