తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిత్రీకరణ అనుమతులపై సూత్రప్రాయ అంగీకారం

తెలంగాణలో షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్‌ రంగ ప్రముఖులు ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం అయ్యారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంత సేపు షూటింగ్‌ చేయాలి? తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

By

Published : May 28, 2020, 4:53 PM IST

Updated : May 28, 2020, 9:18 PM IST

actor naresh
'విధానపరమైన నిర్ణయాలు ఇంకా ఖరారు కాలేదు'

లాక్​డౌన్​తో మూతపడిన చిత్రపరిశ్రమ తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఆగిపోయిన సినిమా, టెలివిజన్ చిత్రీకరణలను మళ్లీ మొదలుపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం దర్శక నిర్మాతలకు సూత్రప్రాయంగా అనుమతిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

గంటన్నర పాటు సాగిన సమావేశం..

హీరో అక్కినేని నాగార్జున, నిర్మాతలు సురేష్ బాబు, సి.కళ్యాణ్, ఏషియన్ సునీల్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్ డీసీ మాజీ ఛైర్మన్ రాంమోహన్ రావు, అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకురాలు సుప్రియ, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్ సహా పలువురు ఎగ్జిబిటర్లు, టెలివిజన్ రంగ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సినిమా చిత్రీకరణల అనుమతులు, థియేటర్ల పునఃప్రారంభం, సెట్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. దర్శక నిర్మాతలు తయారు చేసిన విధి విధానాలపై సుమారు గంటన్నరపాటు చర్చించారు.

దర్శక నిర్మాతలదే బాధ్యత..

త్వరలోనే సినిమా, టీవీ చిత్రీకరణల అనుమతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే అనుమతిలు జారీ చేశాక సెట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దర్శక నిర్మాతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు.

కష్టమే అయినా...

కోవిడ్​తో అందరికి భయాలున్నాయని, కానీ ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలవడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో చిత్రీకరణలు ఎలా చేయాలో ఆలోచిస్తామని హీరో నాగార్జున పేర్కొన్నారు. నటీనటుల విషయంలో భౌతికదూరం చాలా కష్టమే అయినా... నిర్మాతలు బాధ్యత వహించేలా చూడాలని, సెట్​లో పర్యవేక్షకులను ఏర్పాటు చేయాలని కోరినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నరేష్ తెలిపారు.

ఒకేసారి పునఃప్రారంభం..

మొదటి ప్రాధాన్యతగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం... భద్రతా పరమైన విధానాలను తమకే వదిలేసినట్లు నిర్మాత సురేష్ బాబు తెలిపారు. థియేటర్ల విషయంలో దేశవ్యాప్తంగా ఒకేసారి పునఃప్రారంభం అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు.

సినీ పరిశ్రమను మళ్లీ గాడిన పెట్టేందుకు సమాయత్తమైన ప్రభుత్వం.. మరో దఫా పునరాలోచించి ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తోంది.


ఇవీ చూడండి:దండుపై దండయాత్ర- యూకే నుంచి ప్రత్యేక స్ప్రేయర్లు

Last Updated : May 28, 2020, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details