తెలంగాణ

telangana

చిరు బర్త్​డే: 'పునాదిరాళ్లు' నుంచి ఏమాత్రం తగ్గని 'మెగా' జోరు

By

Published : Aug 22, 2020, 5:30 AM IST

నర్తిస్తే నటరాజు సైతం మెచ్చుకుంటాడు. నటిస్తే ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు. కనిపిస్తే ప్రతి అభిమాని ఆరాధిస్తాడు. ఇలా ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. నేడు(ఆగస్టు 22) 66వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన జీవితంపై ఓ లుక్కేద్దాం!

chiranjeevi birth day
చిరంజీవి

"రజినీకాంత్​లా స్టైల్​గా ఫైట్స్​ చేయగలరు... కమల్ హాసన్​లా విభిన్నంగా నటించగలరు... అమితాబ్​లా హాస్యం పండించగలరు"... స్వయానా రజినీయే ఈ మాటలతో మెగాస్టార్​ చిరంజీవిని ప్రశంసించారు. ఇలా అందరి హీరోల ప్రత్యేకతలను తనలో దాచుకుని ఆల్​రౌండర్ అనిపించుకున్నారు చిరు. మారుమూల పల్లె నుంచి వచ్చి ఆల్​ఇండియా స్టార్​గా ఎదిగిన మెగాస్టార్​ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

మెసాస్టారా కామన్​ డిస్​ప్లే పిక్చర్​

నేపథ్యం

1955 ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చెన్నైలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిప్లొమా పొందారు. 1978లో 'పునాదిరాళ్లు' చిత్రంతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు.

పునాదిరాళ్లు చిత్రంలో చిరు

'ప్రాణం ఖరీదు'తో ప్రేక్షకులకు పరిచయం..

'పునాదిరాళ్లు'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా 'ప్రాణం ఖరీదు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'ప్రాణం ఖరీదు' 1978 సెప్టెంబరులో విడుదలైంది. 'పునాది రాళ్లు' 1979 జూన్ 21న వచ్చింది.

'చిరంజీవికి' ఆ పేరు ఎలా వచ్చింది?

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అయితే 'పునాదిరాళ్లు' తీసే సమయంలో స్క్రీన్​ నేమ్​ను చిరంజీవిగా మార్చుకున్నారు. కలలో ఎవరో చిరంజీవి అని పిలిచినట్టు.. దేవుని ఆశీస్సులతో తనకు పేరు లభించినట్టు చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

పాత, కొత్త తరానికి వారధి..

అప్పటికి బ్లాక్ అండ్ వైట్​లోనే సినిమాలు తీసేవారు దర్శకులు. ఎన్టీఆర్​, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబు ఇలా ముందు తరం నటులతో పనిచేశారు మెగాస్టార్. ఈ విధంగా పాత, కొత్త సినిమాలకు వారధిలా మారానని ఆయన ఓ సందర్భంలో అన్నారు.

ప్రేక్షకుల అభిరుచి తెలిసిన హీరో..

అప్పటివరకు సినిమాల్లో పాటలొచ్చే సమయంలో ప్రేక్షకులు విసుగ్గా కనిపించే వారు. హీరోల ఫైట్స్​ సన్నివేశాలను డూప్స్​తో చేయించేవారు. పోరాటాలు మహిళలకు పెద్దగా నచ్చేవి కావు. ఈ రెండు మాస్​ అంశాలను ప్రేక్షకులకు నచ్చేలా ప్రయత్నం చేసిన హీరో చిరంజీవి. కాలానుగుణంగా తగిన పాత్రలు చేస్తూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్​గా ఎదిగారు.

"ప్రేక్షకుడికి, అభిమానికి ఏం కావాలో అది ఇచ్చేందుకు నేను కష్టపడతాను. దాన్నే ఇష్టపడతాను. విభిన్న పాత్రలు పోషించడం అన్ని రకాల, రంగాల వారికి మంచి వినోదాన్ని అందించేందుకే నా కృషంతా. తొలి నుంచి సహజమైన భావోద్వేగాల్ని చూపించాలన్న తపన ఉంది. అందుకే విభిన్నమైన పాత్రలు చేశాను"

-చిరంజీవి, కథానాయకుడు

మైలురాళ్ల లాంటి చిత్రాలు

పునాదిరాళ్లుతో సినీ కెరీర్​ ప్రారంభించిన మెగాస్టార్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖైదీ, స్వయంకృషి, వేట, అడవి దొంగ, రుద్రవీణ, చంటబ్బాయి, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఆపద్భాందవుడు, హిట్లర్, స్నేహం కోసం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.

'చూడాలని ఉంది', 'బావగారూ బాగున్నారా', 'ఇంద్ర', 'ఠాగూర్', 'జై చిరంజీవ', 'స్టాలిన్', 'శంకర్ దాదా' ​ చిత్రాలతో మాస్​లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి.. సినిమాలకు విరామం ఇచ్చారు. అనంతరం 2017లో 'ఖైదీ నెంబర్ 150'తో 'బాస్​ ఈజ్ బ్యాక్' అంటూ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి'తో చిరు నటవిశ్వరూపం చూపించారు.

స్వయంకృషిలో మెగాస్టార్

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

అవార్డులకు కేరాఫ్​..

చిరంజీవి నటనకు అవార్డులు క్యూ కట్టాయి. సినీ పరిశ్రమలో చిరు ప్రస్థానానికి మెచ్చి భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్​తో గౌరవించింది. దీనితో పాటే తొమ్మిది ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు.. నాలుగు నంది అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.

ABOUT THE AUTHOR

...view details