చిత్రసీమ అంటేనే రకరకాల సెంటిమెంట్లకు నెలవు. ఇక్కడ హీరోల నుంచి మొదలు దర్శకులు, నిర్మాతల వరకు ప్రతిఒక్కరికీ ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అలాగే స్టార్ హీరో మహేష్ బాబుకు ఓ సెంటిమెంట్ ఉంది. తన కొత్త చిత్ర ప్రారంభోత్సవాలకి ఎప్పుడూ హాజరవడు. కేవలం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని మాత్రమే పంపుతుంటాడు. ఇక చిత్రసీమలోకి వచ్చిన తొలినాళ్లలో మూడక్షరాల పేర్లను ఓ సెంటిమెంట్లా భావించేవాడు. అందుకే ప్రిన్స్ కెరీర్లోని ఎక్కువ చిత్రాలు మూడక్షరాల టైటిళ్లతోనే వచ్చాయి. మురారి, అతిథి, ఒక్కడు, అర్జున్, ఖలేజా, పోకిరి, దూకుడు, ఆగడు, మహర్షి వంటివి దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఇవేకాదు.. మహేష్కు మరో చిత్రమైన సెంటిమెంట్ కూడా ఉంది. అదే టీ గ్లాస్ సెంటిమెంట్.
ఇటీవల కాలంలో మహేష్ నుంచి బయటకొచ్చిన చిత్రాలను పరిశీలిస్తే.. చిత్ర ప్రచార పర్వాల్లో భాగంగా ఒక్కటైనా టీ గ్లాస్తో ఉన్న మహేష్ పోస్టర్ను వదలడం ఆనవాయితీగా వస్తోన్నట్లు అర్థమవుతోంది. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కు స్టీల్ గ్లాస్లో టీ తాగుతున్న పోస్టర్ను బయటకొదలగా.. 'బిజినెస్మ్యాన్', 'శ్రీమంతుడు', 'మహర్షి' చిత్రాల్లో గాజు గ్లాస్లో టీ తాగుతున్న పోస్టర్లను ప్రేక్షకులకు చూపించాడు. ఇప్పుడిదే సెంటిమెంట్ను 'సరిలేరు నీకెవ్వరు'తోనూ కొనసాగించాడు ప్రిన్స్.