Maheshbabu penny song: మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. ఆదివారం సాయంత్రం ఈసినిమా నుంచి రెండో పాట విడుదలైంది. "ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ’’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. నకాశ్ అజీజ్ అలపించారు. ప్రతి రూపాయిని అందరూ గౌరవించాలంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోలో తమన్ బృందంతో కలిసి మహేశ్ కుమార్తె సితార స్టెప్పులేశారు. ఈ వీడియోని షేర్ చేసిన మహేశ్.. "పెన్నీ పాట నాకెంతో స్పెషల్. నా రాక్స్టార్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు. బ్యాంక్ కుంభకోణం వంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు మరింత యంగ్ లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూపర్స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Galivana teaser: రాధిక, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలివాన’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గాలివాన’ టీజర్ను ఆదివారం ఉదయం విడుదలైంది. క్రైమ్ సన్నివేశాలతో ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ టీజర్లో నటీనటుల మధ్య ఎలాంటి సంభాషణలు చూపించలేదు. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ జంట అనుకోని విధంగా హత్యకు గురి కావడం, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఇంతకీ ఆ జంటను హత్య చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.