తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"సరిలేరు..'తో థ్రిల్​కు గురవుతారు.. అప్పటివరకు ఆగండి'

'సరిలేరు నీకెవ్వరు'.. రేపు(శనివారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో విలేకర్లతో మాట్లాడాడు సూపర్​స్టార్ మహేశ్​బాబు. చిత్ర విశేషాలను పంచుకున్నాడు. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి చెప్పాడు.

By

Published : Jan 10, 2020, 8:03 AM IST

MAHESH BABU ABOUT SARILERU NEEKEVVARU
సూపర్​స్టార్ మహేశ్​బాబు

ఓ స్టార్‌కు హీరోయిజం ఉన్న కథ దొరికితే ఎలా ఉంటుందో 'పోకిరి' నిరూపించింది. అదే స్టార్‌ వినోదం పంచితే ఆ సినిమా స్థాయి ఏంటన్నదానికి 'దూకుడు' ఉదాహరణగా నిలిచింది. సామాజిక ప్రయోజనం ఉన్న సినిమాలు చేస్తే అవే 'శ్రీమంతుడు', 'భరత్‌ అనే నేను', 'మహర్షి' అయ్యాయి. ఈ మూడు చిత్రాలూ గత రికార్డుల్ని దాటుకెళ్లి కొత్త చరిత్ర సృష్టించాయి. ఈ అన్ని కథల్లోనూ స్టార్‌ మహేశ్​బాబునే. తనదైన రోజున మహేశ్ ఏం చేయగలడన్న దానికి ఈ చిత్రాలు సాక్ష్యాలుగా మిగిలాయి. ఈసారి వినోదం, హీరోయిజం, సామాజిక ప్రయోజనం మూడూ కలగలిపి వండి వార్చిన సినిమా అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే 'సరిలేరు నీకెవ్వరు'. శనివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించాడు మహేశ్.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి అంకురార్పణ ఎలా జరిగింది?

'ఎఫ్‌ 2' జరుగుతున్నప్పుడే అనిల్‌ రావిపూడి నాకు ఈ కథ చెప్పారు. వినగానే నచ్చేసింది. కానీ 'నాకు మధ్యలో మరో సినిమా ఉంది. అది అయ్యాక చేద్దాం' అన్నాను. 'ఎఫ్‌ 2' ఎప్పుడైతే చూశానో, అర్జెంటుగా అనిల్‌ రావిపూడి సినిమాను పట్టాలెక్కించేయాలి అనిపించింది. 'త్వరగా పూర్తి చేయగలరా' అని అడిగాను. 'చేసేద్దాం' అన్నాడు. అలా కేవలం అయిదు నెలల్లో పూర్తి చేశాం. ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా ఎలా పూర్తి చేశాడా? అని తలచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడిదే.

స్వతహాగా చిత్రీకరణ కోసం చాలా సమయం తీసుకుంటుంటారు. కానీ ఎప్పుడూ లేనిది 5 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగారు. భవిష్యత్తులోనూ ఇంతే వేగం చూపిస్తారా?

అది కథల్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అందుకే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకున్నాం. ఈ కథ ఒప్పుకోవడం, త్వరగా పూర్తి చేయాలనుకోవడం నా కెరీర్‌లో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలు. నేనైనా మధ్యలో ఐదారు రోజులు రిలాక్స్‌ అయ్యాను. కానీ చిత్రబృందం ఈ అయిదు నెలలూ పగలూ రాత్రీ కష్టపడుతూనే ఉంది.

'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​బాబు-రష్మిక

సైనికాధికారి పాత్ర పోషించారు కదా? అందుకోసం ప్రత్యేకమైన కసరత్తులేమైనా చేశారా?

ఆర్మీ ఆఫీసర్‌ అంటే ఫిట్‌గా కనిపించాలి. అందుకోసం ఆరు కిలోలు తగ్గాను. పాత్ర కోసం ఏం హోంవర్క్‌ చేయాలో అంతా చేశాను. అందుకోసమే ఓ నెల ఆలస్యంగా ఈ సినిమా పట్టాలెక్కింది.

మాస్‌ సినిమా చేయాలన్న అభిమానుల కోరిక తీరినట్టేనా?

'దూకుడు' తరహాలో పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా ఈమధ్య చేయలేదు. మరీ సీరియస్‌ ఎమోషన్స్‌ ఉన్న కథల్ని ఎంచుకుంటున్నానేమో అనిపించింది. ఆ సమయంలో 'సరిలేరు నీకెవ్వరు' కథ వచ్చింది. అనిల్‌ రావిపూడి సినిమాల్లో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇది ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర. కొన్ని హద్దులు ఉంటాయి. ఏది పడితే అది చేయలేం. అవన్నీ దృష్టిలో ఉంచుకుని, ఈ పాత్ర ద్వారా ఎంత వినోదం పంచగలమో, అంతా అందించాం.

లుంగీ లుక్​లో మహేశ్​బాబు

ఈ సినిమాపై మీ అంచనాలు ఏమేరకు ఉన్నాయి?

చెప్పాను కదా.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే (నవ్వుతూ).

చాలా ఏళ్ల తరవాత విజయశాంతితో కలసి నటించారు. ఆ అనుభవాలెలా ఉన్నాయి?

తొలిరోజు సెట్లో కొంచెం కంగారుగా అనిపించింది. మా ఇద్దరిపై సన్నివేశాన్ని పూర్తి చేయగానే, మేమిద్దరం కలసి చేసిన తొలి చిత్రం 'కొడుకు దిద్దిన కాపురం' నిన్నో మొన్నో షూటింగ్‌ చేసిన ఫీలింగ్‌ వచ్చేసింది. ఆమెను తప్ప ఈ పాత్రలో ఎవరినీ ఊహించలేకపోయాను.

మీ నాన్నగారు ఈ సినిమాలో కనిపిస్తారని చెప్పారు. ఏ సందర్భంలో ఆ పాత్ర వస్తుంది?

టికెట్టు కొని సినిమా చూడండి. తెరపై చూస్తే కచ్చితంగా థ్రిల్‌కు గురవుతారు. అప్పటివరకూ ఆగండి.

'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​బాబు

మీనాన్నగారికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు కదా. ఆ కామెంట్‌పై మీ స్పందన ఏమిటి?

చాలా సంతోషం వేసింది. ఇంటికి వెళ్లగానే నాన్నగారికి ఈ విషయం చెప్పాను. 'చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. ఆయనకు థ్యాంక్స్‌ చెప్పు' అన్నారు. ముందు నుంచీ చిరంజీవిగారు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా సినిమా హిట్టయితే తొలి ఫోన్‌ కాల్‌ ఆయన దగ్గరి నుంచే వస్తుంది. జనవరి 12న ఆయన నుంచి ఫోన్‌ వస్తుందని ఆశిస్తున్నాను.

సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' రెండూ ఒకేరోజు విడుదల అవుతాయేమో అనుకున్నారు. ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది?

పెద్ద సినిమాలకు సోలో రిలీజ్‌ ఉంటే బాగుంటుంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం సరికాదు. దాని వల్ల వసూళ్లను పంచుకోవాలి. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలివి. బయ్యర్లు నష్టపోతారు. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. వాళ్లకి నా కృతజ్ఞతలు.

'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​బాబు

అడ్వాన్సు తీసుకోకుండా ఈ సినిమా చేశారు కదా. అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చింది?

చాలా త్వరగా ఈ సినిమాను పూర్తి చేద్దాం అనుకున్నాం. అనుకున్న సమయానికి విడుదల అవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఆ వెసులుబాటు నిర్మాతలకు కల్పించాలి.

నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. భవిష్యత్తులోనూ నిర్మాణాన్ని కొనసాగిస్తారా?

తప్పకుండా. అయితే 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాణ విషయాల్లో నేనేం జోక్యం చేసుకోలేదు.

పాన్‌ ఇండియా సినిమాలు ఈమధ్య బాగా వస్తున్నాయి. మీరూ అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా?

దక్షిణాది చిత్రాలు బాగా ఆడుతున్నాయి. సరిహద్దుల్ని చెరిపేస్తూ మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. 'కేజీఎఫ్‌' లాంటి చిత్రాలు బాలీవుడ్‌కూ వెళ్లి నిరూపించుకున్నాయి. మంచి కథ వస్తే తప్పకుండా పాన్‌ ఇండియా స్థాయి సినిమా తీయొచ్చు.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఉందా?

ఆ మధ్య మేం కలుసుకున్న మాట వాస్తవమే. కొన్ని కథలూ అనుకున్నాం. ఎప్పుడు చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేను.

తదుపరి సినిమా ఎప్పుడు?

'సరిలేరు...' తరవాత రెండు నెలలు గ్యాప్‌ తీసుకుంటా. ఆ తరవాత వంశీ పైడిపల్లి సినిమా ఉంటుంది. ఈసారి పూర్తిస్థాయి కమర్షియల్‌ చిత్రం చేస్తాం.

కథ నచ్చాక, స్క్రిప్టు 'ఓకే' అయ్యాక నేను పూర్తిగా దర్శకుడికి లొంగిపోతాను. తను చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతాను. నేర్చుకున్నదంతా పక్కన పెట్టి, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను పనిచేసే పద్ధతి అలానే ఉంటుంది. ఉన్నదాంట్లోనే కొత్తగా ఏం చేయగలం? అనేది ఆలోచిస్తుంటాను. ప్రయోగాలు చేద్దామని అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అన్నివేళలా సాధ్యం కాదు. పెద్ద హీరోలంతా విచిత్రమైన జోన్‌లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే ప్రయోగాలు చేసేయకూడదు. రూ.వందల కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయో, లేదో చూసుకోవాలి. అదే సమయంలో కథలో కొత్తదనం ఉండాలి. ఇవన్నీ కుదిరితే ఓకే. లేదంటే బయ్యర్లు నష్టపోతారు.

ABOUT THE AUTHOR

...view details