ప్రపంచవ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన 'కేజీఎఫ్' సినిమా నిర్మాతలు ఓ తెలుగు ఛానెల్పై కేసు పెట్టనున్నారు. అనధికారికంగా 'కేజీఎఫ్' సినిమాను ప్రసారం చేశారని చిత్ర నిర్మాత కార్తిక్ గౌడ ట్వీట్ చేశారు. సదరు ఛానెల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.
తెలుగు ఛానెల్పై కేసు పెట్టనున్న 'కేజీఎఫ్' నిర్మాతలు - కేజీఎఫ్ తాజా వార్తలు
'కేజీఎఫ్' చిత్రాన్ని అనధికారికంగా ప్రసారం చేసినందుకు ఓ తెలుగు ఛానెల్పై కేసు పెట్టనున్నారు ఆ సినిమా నిర్మాతలు. శాటిలైట్ డీలింగ్ దాదాపు పూర్తవుతున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఓ తెలుగు లోకల్ ఛానెల్ 'కేజీఎఫ్' సినిమాను అనధికారికంగా ప్రసారం చేసింది. వారిపై మేం చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం. సమన్లు జారీ చేస్తాం. శాటిలైట్ డీలింగ్ దాదాపు ఖరారౌతున్న సమయంలో కేబుల్ ఛానెల్ ఈ పనిచేసింది. మా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. వీడియోలు కూడా సేవ్ చేసిపెట్టుకున్నాం" అంటూ సదరు ఛానెల్లో 'కేజీఎఫ్' ప్రసారమౌతున్నప్పుడు తీసిన ఫొటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందించారు. 'కేజీఎఫ్'ను లోకల్ ఛానెల్లో పలుమార్లు ప్రసారం చేశారని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని నిర్మాతలు స్పష్టం చేశారు.
'కేజీఎఫ్' సినిమాలో యశ్ హీరో. ప్రశాంత్ నీల్ దర్శకుడు. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా 'కేజీఎఫ్ 2' తెరకెక్కుతోంది. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్లో భారీ సెట్ ఏర్పాటు చేశారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ను తిరిగి కొనసాగించనున్నారు.