కథానాయిక కీర్తి సురేష్ మరో కొత్త వసంతంలోకి అడుగుపెట్టింది. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ జూనియర్ సావిత్రి... మరోసారి నాయికా ప్రాధాన్య చిత్రంలో కనువిందు చేయనుంది. ఇటీవలే కొత్త ప్రాజెక్టును ఖరారు చేసిన చిత్రబృందం.. నేడు కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఓ లుక్ను విడుదల చేసింది.
ఈ చిత్రంలో ఆమెతో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వర్త్ ఎ షాట్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ ఈ సినిమాతో టాలీవుడ్కు పరిచయవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చుతున్నాడు. వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్లో చివరి దశ చిత్రీకరణ జరగనుంది. స్పోర్ట్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్లుక్ దీపావళికి విడుదల కానుంది.
'మహానటి' తర్వాత కీర్తి సురేశ్ నేరుగా తెలుగులో నటించలేదు. 2018లో తమిళంలో ఆమె నటించిన 'సీమరాజా', 'స్వామి 2', 'పందెం కోడి 2', 'సర్కార్' సినిమాలు విడుదలై మంచి టాక్ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్లోనూ అరంగేట్రం చేయబోతోంది. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
ఆసక్తికర విశేషాలు....
- తమిళం, మలయాళంపై మంచి పట్టున్న కీర్తి... 'మహానటి' సినిమా తెలుగు డబ్బింగ్ చెప్పేటప్పుడు బాగా ఇబ్బందిపడిందట. మొదటిసారి ఈ చిత్రం ద్వారానే తెలుగు తెరపై తన ఒరిజినల్ గాత్రాన్ని వినిపించింది.
- స్విమ్మింగ్లో మంచి ప్రావీణ్యం కీర్తి సొంతం. పాఠశాల స్థాయిలోనే ఈ క్రీడలో చాలా సార్లు ఛాంపియన్గా పతకాలు అందుకుందట.
- ఈ నటి ఆరోగ్య, సౌందర్య రహస్యం శాకాహారమేనట. ప్రతిరోజు కొంత సమయం కచ్చితంగా ఫిట్నెస్ కోసం కేటాయిస్తుంది.
- సినిమాల్లోకి రాకముందు చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిందీ యువనటి. స్కాట్లాండ్ వెళ్లి ఓ డిజైనింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. నటన వైపు వెళ్లకపోతే ఇదే రంగంలో స్థిరపడేదట.
మలయాళ చిత్రం 'పైలట్'తో తొలిసారి బాలనటిగా కనిపించింది కీర్తి సురేష్. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంది విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కుబేరన్, అచనేయ నేనికిస్టమ్ అనే సినిమాలో కనిపించింది. ఈ మూడు సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. అలా చిన్నప్పుడే హ్యాట్రిక్ విజయాలు అందుకుంది కీర్తి.