బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు పండగే పండగ. ఇప్పుడు దీనినే నిజం చేసేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'జీ లే జరా' టైటిల్తో కొత్త సినిమా ప్రకటించారు. రోడ్ ట్రిప్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. 2023లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా 'దిల్ చహ్తా హై' 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త సినిమా ప్రకటన చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఫర్హాన్ అక్తర్. చివరిసారిగా 2011లో షారుక్ ఖాన్తో 'డాన్ 2'ను తెరకెక్కించిన ఆయన.. ఇటీవల 'తుఫాన్' సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.