"జీవితంలో చాలా విషయాల్ని మనం చిన్నవిగా చూస్తుంటాం. కానీ అవే అప్పుడప్పుడు పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఆ విషయాన్ని మాదైన శైలిలో చెప్పడం సహా.. మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ప్రేక్షకులకు పంచేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం" అని అన్నారు దర్శకుడు ఎస్.దర్శన్. ఆయన తెరకెక్కించిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. సుశాంత్ కథానాయకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శన్ ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
"చెన్నైలో నాకు... నా స్నేహితుడికి ఎదురైన కొన్ని సంఘటనల్లో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తోపాటు... కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంశాల మేళవింపు చక్కటి వినోదం పంచుతుంది. సుశాంత్ ఆర్కిటెక్చర్గా పనిచేసే ఓ మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తాడు. ఆ ఆఫీస్లోనే పనిచేసే అమ్మాయిగా కథానాయిక మీనాక్షి చౌదరి కనిపిస్తుంది".
* "దర్శకుడు శ్రీనివాస్రెడ్డి దగ్గర 'ఢమరుకం'తో పాటు మరో సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆయన ఇచ్చిన ప్రోత్సాహ మరువలేనిది. నేను తెలుగు నేర్చుకున్నది 'ఢమరుకం' సెట్లోనే. మా నాన్న కేశవ్ తమిళంలో పేరున్న రచయిత. కె.ఎస్.రవికుమార్, పాండిరాజ్ దగ్గర రచనా విభాగంలో పనిచేశారు.