మాజీ మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ మానవతా హృదయాన్ని చాటుకుంది. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్కు చేయూతనందించేందుకు.. తన పెయింటింగ్స్ను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. 'స్మైల్' స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. ఈ విధంగా పోగైన డబ్బును కొవిడ్ వారియర్స్తో పాటు వారి కుటుంబాలకు పీపీఈ కిట్లు అందించేందుకు ఉపయోగించనున్నట్లు స్పష్టం చేసింది.
"ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నాం. కానీ రైతులు, ట్రక్ డ్రైవర్లు, అనేక మంది కార్మికులు, ఫ్రంట్లైన్ వర్కర్లు మన కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మనసుతో మనకోసం పనిచేస్తున్న వీరందరికి 'స్మైల్' ఫౌండేషన్ ద్వారా పీపీఈ కిట్లు అందించనున్నాం. కష్ట సమయంలో మన కోసం పనిచేస్తున్న హీరోలపై పెయింటింగులు రూపొందించాను. వాటిని ఇప్పుడు వేలం వేయగా వచ్చిన సొమ్ముతో పీపీఈ కిట్లను అందిస్తాం".