తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2021, 11:02 AM IST

ETV Bharat / sitara

'ఆ కసి, కోపంతోనే 'రన్ రాజా రన్' స్టోరీ రాశా'

'రన్ రాజా రన్'తో వెండితెరపై తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు సుజీత్. ఆ తర్వాత ప్రభాస్​తో 'సాహో' లాంటి పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'నీకు మాత్రమే చెబుతా' కార్యక్రమంలో పాల్గొన్న సుజీత్ పలు విషయాలు పంచుకున్నారు.

Director Sujith
సుజీత్

'రన్‌ రాజా రన్‌'.. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజీత్‌. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్‌కు ప్రభాస్‌ 'సాహో' అవకాశమిచ్చారు. 'బాహుబలి' తర్వాత పాన్‌ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కింది. దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్టు ప్రకటించని సుజీత్‌ ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే 'నీకు మాత్రమే చెబుతా' కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్‌ తొలి నాళ్లలో తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

సుజీత్, ప్రభాస్

"అవకాశాల కోసం బాగా తిరుగుతూ.. ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నా. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించా. 'రన్‌ రాజా రన్‌' కంటే ముందు నిర్మాతలకు ఇది వినిపించా. ఫస్ట్‌ హాఫ్‌ వారికి బాగా నచ్చింది. సెకండాఫ్‌ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లు ఆలోచించి మంచి వర్షన్‌ రాశా. ప్రొడక్షన్‌ ఆఫీసుకు వెళ్లి.. సెకండాఫ్‌ వినిపించా.. వాళ్లు సూపర్‌ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంతో బండిపై బయలుదేరా. మార్గమధ్యలోనే.. ఫోన్‌ బాగా రింగవుతోంది. బండి పక్కకు ఆపి లిఫ్ట్‌ చేశా. ‘చూడమ్మా ఈ కథకు బడ్జెట్‌ ఎక్కువయ్యేట్లు ఉంది.. వేరే కథ ఉంటే చెప్పు’ అన్నారు. ఒక్కసారిగా మైండ్‌ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటల పాటు ఏడ్చాను"

"ఆ సమయంలో వెన్నెల కిషోర్‌కు ఫోన్‌ చేశా. అతను కాస్త ధైర్యం ఇచ్చాడు. 'నువ్వు షార్ట్‌ ఫిల్మ్‌ గంటలో రాయగలవు.. సినిమా ఒక రోజులో రాయలేవా?' అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఉత్సాహంలో జోరుగా అక్కడి నుంచి లేచి బయలు దేరదామని బండి స్టార్ట్‌ చేస్తే కాలేదు. పెట్రోల్‌ అయిపోయింది. చేతిలో చిల్లగవ్వ లేదు. జోరున వాన. ఎవరికి ఫోన్‌ చేయాలో తెలియదు. బండిని అలా నెట్టుకుంటూ జూబ్లీహిల్స్‌ నుంచి ముషీరాబాద్‌ వరకూ వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు.. బాధ, కోపం, కసి అన్నీ రకాల ఫీలింగ్స్‌ వచ్చాయి. అదే ఆలోచనలతో ఇంటికి వచ్చి తల తుడుచుకున్నా.. అంతే 'రన్‌ రాజా రన్‌' కథ ఫ్లాష్‌ అయ్యింది. వెంటనే ప్రొడక్షన్‌ వాళ్లకు ఫోన్‌ చేసి ‘సంవత్సరం నుంచి ఓ కథ రాస్తున్నా... చెప్పమంటారా?’ అని అడిగా. రేపు వచ్చేయ్‌ అన్నారు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది మూడు రోజుల్లో వస్తానని చెప్పి.. 'రన్‌ రాజా రాన్‌' కథ మొత్తం రాసి తీసుకెళ్లా. ఒక్క డైలాగ్‌ కూడా మార్చకుండా.. ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు... మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది." అని వెల్లడించారు సుజీత్.

ఇవీ చూడండి: కన్నీళ్లు పెట్టుకున్న గణేశ్​ మాస్టర్.. ఏమైందంటే?

ABOUT THE AUTHOR

...view details