అద్భుత దృశ్య కావ్యాలకు కేరాఫ్ అడ్రస్ మణిరత్నం. అతడి సినిమా ఓ మ్యాజిక్. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మంత్ర దండమేదో అతని చేతిలో ఉంది కావచ్చు. అందుకే మణిరత్నం తీసిన సినిమాలు తక్కువే అయినా, దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. అరవిందస్వామి కథానాయకుడిగా 'రోజా' సినిమాతో జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నాడీ స్టార్ దర్శకుడు.
ఆ మరుసటి ఏడాది 'దొంగా దొంగా'తో కమర్షియల్గా ఘన విజయాన్ని అందుకున్నాడు. కానీ, మణిరత్నం ఈసారి పెద్ద ప్రాజెక్ట్నే చేపట్టాడు. అది అలాంటి ఇలాంటి సబ్జెక్ట్ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా, దేశం అల్ల కల్లోమైపోతుంది. అలాంటి సబ్జెక్ట్ను తీసుకున్నాడు. అదే 'బొంబాయి' సినిమా. 1995 మార్చి 10న విడుదలైన ఈ చిత్రం నేటితో 25ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఏంటీ బొంబాయి కథ!
శేఖర్(అరవింద స్వామి)ది ఆచారాలు, సంప్రదాయాలు పాటించే కుటుంబం. ముంబయిలో జర్నలిస్ట్గా పనిచేస్తుంటాడు. ఒకసారి ఊరు వచ్చిన అతడు అనుకోకుండా ముస్లిం యువతి షైలా భాను(మనీషా కొయిరాలా)ను చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తపరుస్తాడు. అయితే, మొదట ఆమె శేఖర్ను దూరంగా పెడుతుంది. అతని ప్రేమలో నిజాయతీని అర్థం చేసుకుని తనూ ప్రేమించటం మొదలు పెడుతుంది. ఈ విషయంలో ఇద్దరి ఇళ్లలో తెలిసి గొడవ జరుగుతుంది.
చివరకు షైలా భాను తను ప్రేమించిన శేఖర్ కోసం ఇల్లు విడిచి ముంబయి వెళ్లిపోతుంది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులకు కోపాలు తగ్గి శేఖర్, షైలా భానులను చూడటానికి ముంబయి వస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మత కల్లోలు చెలరేగుతాయి. వాటి వల్ల ఎంతమంది నష్టపోయారు. శేఖర్ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? చివరకు ఆ గొడవలు ఎలా సద్దుమణిగాయన్నది 'బొంబాయి కథ'.
విక్రమ్ చేయాల్సింది కానీ..
మణిరత్నం 'దొంగా దొంగా' సినిమా నేపథ్య సంగీత పనుల్లో బిజీగా ఉన్న సమయంలో.. ముంబయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాన్ని తీసుకుని సినిమా తీయాలన్న ఆలోచన అతడికి వచ్చింది. ప్రముఖ మళయాళ రచయిత ఎం.టి వాసుదేవన్ నాయర్ను కథ, కథనాలను సిద్ధం చేయమని కోరాడు. కానీ, అది ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు తానే కూర్చొని కథను సిద్ధం చేసుకుని ఓ తమిళ సినిమాగా చేయాలని అనుకున్నాడు. తొలుత ఈ సినిమా కోసం విక్రమ్, మనీషా కొయిరాలాలకు ఫొటో షూట్ చేశారు.
అయితే, అప్పటికే మరో చిత్రం కోసం గడ్డం, మీసం పెంచిన విక్రమ్ దాన్ని తొలగించేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా 'రోజా'లో చేసిన అరవిందస్వామినే హీరోగా తీసుకున్నాడు. నాజర్ను నారాయణమూర్తి పాత్రకు, రాజా కృష్ణమూర్తి(కిట్టు)ను బషీర్ పాత్రకు ఎంపిక చేశాడు. సినిమాటోగ్రాఫర్గా రాజీవ్ మేనన్ను ఎంపిక చేశారు. అరవిందస్వామి, మనీషా కొయిరాలాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల వర్షంలో తీయాలన్న ఆలోచన అతడిదే కావటం విశేషం. పొల్లాచి, కాసర్గోడ్, కన్నూర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు.
'కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే' పాటను 'తిరుమల నాయక్కర్ మహల్'లో తీశారు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన వీడియోను ప్రసారం చేసేందుకు సెన్సార్బోర్డు ఒప్పుకోలేదు. ఫలితంగా పత్రికలు, ఫొటోలను మాత్రమే చిత్రంలో చూపించారు.
విడుదల.. వివాదాలు.. విజయం..