మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు ఒక ప్రభంజనం. తెలుగు చిత్రసీమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన చిరు తన కెరీర్లో ఎన్నో అద్భుత సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన డ్యాన్స్, ఫైట్స్ , యాక్షన్తో అభిమానులను మెప్పించారు. ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచిన చిరు నట ప్రస్థానం ప్రారంభమై నేటికి 42 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలివి..
చిరంజీవి నటించిన మొదటి సినిమా 'పునాది రాళ్లు' అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ చిత్రం కంటే ముందు 'ప్రాణం ఖరీదు' విడుదలైంది. ఈ చిత్రంతోనే ప్రేక్షకులకు పరిచయమయ్యారు చిరు. సెప్టెంబరు 22, 1978లో విడుదలైందీ సినిమా.
ఈ చిత్రంలో రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు. దీంతో పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలు అని నటుడు సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఉన్నోడి మీదకు పెదోడిని తిరుగుబాటుకు ప్రేరేపిస్తాయి. ఇదే ఈ సినిమా కథాంశం.
ఆ తర్వాత..
1979లో రిలీజైంది 'పునాది రాళ్లు' చిత్రం. ఈ సినిమా విడుదలకు ముందు 'మనవూరి పాండవులు', 'తాయారమ్మ బంగారయ్య', 'కుక్క కాటుకు చెప్పుదెబ్బ'... వంటి పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు చిరు.
అవార్డులు:
శుభలేఖ, ఇంటిగుట్టు, రుద్రవీణ, ముఠా మేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకుగాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు చిరు. ఆపద్బాంధవుడు, స్వయం కృషి, ఇంద్రతో ఉత్తమ నటుడుగా నంది అవార్డు పొందారు.