తెలంగాణ

telangana

'ఎస్పీబీ లాంటి వ్యక్తిని మళ్లీ చూడలేనేమో!'

By

Published : Sep 27, 2020, 12:16 PM IST

స్వరసామ్రాట్​ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో తాను తీవ్ర ఆవేదనకు లోనైనట్లు సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​ తెలిపారు. బాలుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రెహమాన్​ ఓ వీడియోను విడుదల చేశారు.

Celebrating SP Balasubrahmanyam life says AR Rahman
'ఎస్పీబీ లాంటి వ్యక్తిని మళ్లీ చూడలేనేమో!'

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడటం వల్ల భారత చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలు మరణంతో తన గుండె పగిలిందని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయనతో కలిసి పంచుకున్న మధుర సంఘటనల్ని తెలుపుతూ.. ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 'ఎస్పీబీ జీవితాన్ని సెలబ్రేట్‌ చేద్దాం..' అని పేర్కొన్నారు.

"చాలా ఏళ్ల క్రితం సుహాసిని మణిరత్నం.. ఎస్పీబీ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. అందులో నేను ప్రదర్శన ఇచ్చా. నేను అప్పుడప్పుడే కెరీర్‌ ఆరంభిస్తున్న రోజులవి. ఆ తర్వాత 'రోజా' సినిమా కోసం సంగీత దర్శకుడిగా పనిచేశా. ఈ చిత్రంలోని పాట రికార్డింగ్‌ కోసం బాలు సర్‌ స్టూడియో దగ్గరకు వచ్చారు. అక్కడి వాతావరణం చూసి.. ఇక్కడ మ్యూజిక్‌ రికార్డింగ్‌ చేస్తారా అని ప్రశ్నించారు. నేను నవ్వాను.. ఆపై 'రోజా' సినిమా విడుదల తర్వాత సర్‌ నా దగ్గరికి వచ్చి, సంగీతాన్ని ఎక్కడైనా సృష్టించొచ్చు అన్నారు".

- ఏఆర్​ రెహమాన్​, సంగీత దర్శకుడు

అంత వేగంగా పాటలు పాడే గాయకుడ్ని.. వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిని మళ్లీ చూడలేనేమోనని ఏఆర్​ రెహమాన్​ అన్నారు.

"బాలు సర్‌ 15 నిమిషాల్లోనే పాటను నేర్చుకునేవారు. పది నిమిషాల్లో పాడేసేవారు. వెంటనే మరో రికార్డింగ్‌లోకి వెళ్లిపోయేవారు. ఇంత వేగంగా పాటలు పాడే గాయకుడ్ని, వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిని మళ్లీ చూడలేనేమో.. ఇప్పుడు మనమంతా కలిసి ఆయన సంగీతాన్ని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎస్పీబీ సర్‌.. మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. కానీ మిమ్మల్ని కోల్పోయామని మాత్రం చెప్పను" అని రెహమాన్‌ వీడియోలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details