బ్రహ్మానందంని చూడగానే నవ్వొస్తుంది. నటుడిగా ఆయన ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అలాంటిది. ఆయన్ని పలకరిస్తే మాత్రం పూర్వాశ్రమంలోని అధ్యాపకుడు బయటికొస్తాడు, పేదరికం నుంచి ఎదిగిన ఓ శ్రమజీవి తొంగిచూస్తాడు. ఆయన మాటలన్నీ ఒక మంచి బతుకు పాఠంలా అనిపిస్తాయి. ఆయనతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం కరోనా విపత్తు, తన జీవితం, చిత్ర లేఖనం తదితర విషయాల గురించి మనసు విప్పారు.
"35 ఏళ్ల సినీ ప్రయాణం నాది. ఇదివరకు విరామం తీసుకున్నా కానీ... ఒకేసారి ఇన్ని రోజులు, ఇలాంటి విరామాన్ని మాత్రం తీసుకోలేదు. ఉంటే సినిమా సెట్లో లేదంటే ఇంట్లో గడుపుతుంటా. దాంతో ఇప్పుడు నాకేం ఇబ్బందిగా అనిపించడం లేదు. అందరిలాగే నేను కూడా కుటుంబంతో గడుపుతున్నాను, మనవడితో ఆడుకుంటున్నాను, పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం... ఇలా మనసుకు నచ్చినవి చేస్తున్నాను. ఇలా గడుపుతున్నా, ఇవి చేస్తున్నా.. అని చెబుతానేమో కానీ - ఎన్ని చేస్తున్నా ఇందులో జీవితం మాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనసులో ఒక భయం అనేది రన్ అవుతూ ఉంటుంది. గుండె నుంచి ఒక సన్నటి దారం బయటికి లాగుతున్న బాధ కలుగుతుంది. బయట ఎంత మంది మనవళ్లు ఆకలితో బాధపడు తున్నారో కదా! దారి పొడవునా వలస కూలీల పరిస్థితిని ఒకసారి తలచుకొని చూడండి. ఇదా జీవితం అన్న మనోవేదన గుండెని పిండేస్తుంది. నాకు ఇల్లుంది కాబట్టి ఇంట్లో కాలక్షేపం చేస్తున్నా. ఇల్లే లేనోళ్ల పరిస్థితి? ఇళ్లల్లోకి రావద్దని చెప్పడంతో బయటే ఆగిపోతున్నవాళ్ల పరిస్థితి? అలాగని నువ్వేం చేయగలవయ్యా అంటారేమో... మనకు తెలిసిన సాయం మనం చేద్దాం. ఇంకొకడికి సాయం చేస్తున్నామని కాకుండా.. ఎదుటివాడూ మన కుటుంబ సభ్యుడే అనుకుని అండగా నిలుద్దాం. అలాంటి సమయం ఇది".
పొదుపు చేస్తేనే బతుకు
"కరోనాతో స్తంభించిపోయిన ఈ కాలంలో... అన్ని రకాలుగా ఉన్నవాళ్లకి, తినగలిగే శక్తి ఉండి ఇంట్లో కూర్చుని తింటున్నవాళ్లకి ఉపశమనంలా అనిపించొచ్చు, అందరితోపాటే మనమూ ఆగిపోయాం అనే భావన వాళ్లకి కలగొచ్చు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడనివాళ్లకి మాత్రం ఇదొక భయంకరమైన శాపంలా అనిపిస్తుంది. రెండు పూటలా తిండి లేని జనం మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఈ కరోనా ఎన్నో పాఠాల్ని నేర్పించింది. పేదరికం నుంచి వచ్చినవాణ్ని కాబట్టి... భవిష్యత్తు తరాలవాళ్లకి చెప్పేదొక్కటే. వంద రూపాయలు సంపాదించుకుంటే అతికష్టం మీదైనా అందులో ఒక రూపాయైనా పొదుపు చేయాలి! వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడితే చివరికి ఏమీ మిగలదు. అనుకోకుండా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, చేతిలో ఏమీ ఉండకపోతే పేదరికంతో అలమటించాలి. కోట్లు సంపాదించేవాళ్లు కోట్లు, లక్షలు సంపాదించేవాళ్లు లక్షలు దాచి పెట్టుకుంటారు. గంజి తాగి బతికేవాళ్లు పది రోజులకి సరిపడా గంజైనా దాచుకోవాలి. మనిషి తనకున్న పనిని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు సహనం దానంతట అదే వస్తుంది"