తారలు తెరపై ఉత్సాహంగా ఆడిపాడుతుంటే చూసి... అదే స్థాయిలో స్పందిస్తూ ఆస్వాదించడం ప్రేక్షకులకు అలవాటు. వాళ్ల ఆటా పాటా నచ్చిందంటే థియేటర్లు ఈలలూ.. కేకలతో సంబరాలు చేసుకుంటాయి. అందుకే తమ చిత్రాల్లో ఆకట్టుకునే గీతాలుండేలా చూసుకుంటారు దర్శకనిర్మాతలు. హీరోలైతే ఈ విషయంలో జాగ్రత్త వహిస్తుంటారు.కాంబినేషన్లలో సంగీత దర్శకుల పేర్లు కీలకంగా మారిపోయేదీ అందుకే మరి! ప్రచార పర్వం భుజాలకెత్తుకోవడంలో ఒకొక్కరిది ఒక్కో పంథా. కొందరు ఫస్ట్లుక్కులు, టైటిళ్లతోనే క్రేజు పెంచితే.. మరికొందరు టీజర్లు, ట్రైలర్లతో కిక్కిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. పేర్లు ఏవైనా ప్రతి ప్రచార చిత్రం వెనుకా లక్ష్యం ఒక్కటే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం. ఇటీవల పాటలు అందులో భాగమవుతున్నాయి. ఇప్పుడీ లాక్డౌన్ పరిస్థితుల వల్ల విడుదలకు నోచుకోలేకపోయిన చిత్రాలకూ ఈ పాటలే కావాల్సినంత ప్రచారాన్ని అందిస్తున్నాయి.
ఆ చిత్ర ఫలితాలే స్ఫూర్తిగా..
పాటలు సినిమాకి ప్రచారాన్ని తీసుకురావొచ్చేమో కానీ... ఫలితాల్ని ప్రభావితం చేసేది అంతిమంగా అందులో ఉన్న విషయమే. పాటలు ఎంత బాగున్నా... కథ, కథనాలు నచ్చలేదంటే ప్రేక్షకుడి తిరస్కరణ తప్పదు. ఆ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అయితే ఇటీవల పాటలతో మురిపించి సినీ ప్రియుల్ని ఆకర్షించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో 'అల.. వైకుంఠపురములో' ప్రముఖమైనది. తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా విడుదల వుతుందంటే.. నెలన్నర ముందు నుంచి పాటల సందడి మొదలవుతుంది. వైకుంఠపురం బృందం మూడు నెలల ముందే తొలి గీతంగా 'సామజవరగమన..'ను సినీ ప్రియులకు చేరువ చేసింది. దీని తర్వాత బయటకొచ్చిన 'రాములో రాములా', 'బుట్టబొమ్మ..' గీతాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక గతేడాది పాటలతోనే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన 'ఇస్మార్ట్ శంకర్', 'సైరా', 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే' చిత్ర బృందాలు ఇదే మార్గంలో నడిచాయి. ఈ విజయాలిచ్చిన స్ఫూర్తితోనే ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలూ పాటల పల్లకినే ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నాయి.
మిలియన్ మార్క్స్
లాక్డౌన్ కాలంలో మారుమోగిన వాటిల్లో ముందు వరుసలో ఉన్నవి ‘ఉప్పెన’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’, 'వకీల్ సాబ్', 'వి', 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రాల్లోని గీతాలు.
పవన్ కల్యాణ్ రీఎంట్రీ చిత్రం 'వకీల్సాబ్'ను మేలో విడుదల చేద్దామనుకున్నారు. ఈ ఉద్దేశంతోనే చిత్ర ప్రచార పర్వానికి రెండు నెలలు ముందుగానే మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఓ 'మగువా మగువా' పాటతో శ్రీకారం చుట్టారు. తమన్ స్వర కల్పనలో సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతమిది. ఈ చిత్రం అనుకున్న సమయానికి తెరపైకి రాలేకపోయినప్పటికీ.. ఈ చిత్ర గీతం నెట్టింట సినీ సంగీత ప్రియులకు మంచి కాలక్షేపాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఈ గీతాన్ని యూట్యూబ్లో దాదాపు 2కోట్ల మందికి పైగా వీక్షించారు.
ఇక ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వర సారథ్యం వహించిన 'ఉప్పెన'లోని 'నీ కన్ను నీలి సముద్రం..', 'ధక్.. ధక్..' గీతాలు సైతం సినీప్రియులకు కావల్సినంత కాలక్షేపాన్ని, చిత్ర బృందానికి ప్రచారాన్నీ తెచ్చిపెడుతున్నాయి. 'నీ కన్ను నీలి సముద్రం'కి ఇప్పటికే నెట్టింట 7కోట్ల పైచిలుకు వీక్షణలు దక్కగా.. 'ధక్ ధక్' గీతానికి 1కోటీ 40లక్షలకు పైగామంది వీక్షించారు.