తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమలో పడి అవకాశాలు వదులుకున్న ఆర్తి అగర్వాల్! - Aarthi Agarwal

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటి ఆర్తి అగర్వాల్​. 'నువ్వు నాకు నచ్చావ్​' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ఆ తర్వాత ఓ కుర్ర హీరోతో ప్రేమలో పడటం వల్ల సినిమా అవకాశాలు కోల్పోయిందని ఆర్తి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేడు (జూన్​ 6) ఆమె​ వర్థంతి. ఈ సందర్భంగా ఆమె కెరీర్​లోని కొన్ని విశేషాలు చూద్దాం.

Actress Aarthi Agarwal Death Anniversary Special Story
'ఆ కుర్రహీరోతో ప్రేమలో పడి తప్పుచేశా'

By

Published : Jun 6, 2020, 6:12 AM IST

పదహారేళ్ల వయసులోనే చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన ఓ అందాల భామ అనతికాలంలోనే 'స్టార్‌' ఇమేజ్‌ని సంతరించుకుంది. మెరుపులా పరిశ్రమలో ప్రవేశించి అచిర కాలంలోనే అగ్రశ్రేణి నటుల సరసన చిరుదివ్వెగా వెలిగింది. కీర్తి శిఖరాలను అందుకుంది. అచ్చం తెలుగు సినిమాలో జరిగినట్లే ప్రేమలో విఫలం చెందింది. ఆత్మహత్యా ప్రయత్నానికి సాహసించింది. సినిమా అవకాశాలను దూరం చేసుకుంది. పెళ్లి చేసుకొన్న భర్తకు విడాకులిచ్చింది. ఊబకాయం తగ్గించుకుని తిరిగి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంది. ఆ ప్రయత్నంలో అనూహ్యంగా ప్రాణాలనే విడిచింది. ఇది ఆర్తి అగర్వాల్‌ విషాద గాథ. నేడు (జూన్​ 6) ఆమె వర్థంతి సందర్భంగా ఆర్తి అగర్వాల్​ జీవితంలోని కొన్ని విశేషాలివే..

ఆర్తి అగర్వాల్

పుట్టింది రాజకుమారిగా...

పుట్టింది అమెరికా దేశంలోని న్యూజెర్సీ మహానగరంలో. తండ్రి శశాంక్‌ అగర్వాల్‌ వ్యాపారంలో స్థిరపడిన శ్రీమంతుడు. పద్నాలుగేళ్ల వయసు వచ్చేదాకా న్యూజెర్సీలోనే తన చెల్లెలు ఆదితి అగర్వాల్‌తో కలిసి చదువు కొనసాగింది ఆర్తి. మోడలింగ్‌ అంటే ఆర్తికి ఎంతో ఇష్టం. నటుడు, నిర్మాత సునీల్‌శెట్టి అమెరికాకు వెళ్లినప్పుడు ఆర్తిని చూసి ఆమె చేత ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇప్పించారు. ఆ ప్రదర్శనలకు బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్​‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సునీల్‌శెట్టితో పాటు బిగ్‌-బి కూడా ఆమె ప్రదర్శనకు ముచ్చటపడి బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అలా ఆర్తికి మంచి నటిగా ఎదగాలని కలలు మొదలయ్యాయి. పదహారేళ్ల వయసులో ఇండియాకి వచ్చింది. 2001లో నిర్మాత రాజీవ్‌షా, జోయ్‌ అగస్టీన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పాగల్‌పన్‌' బాలీవుడ్‌ సినిమాలో.. ఐదుగురు అన్నదమ్ముల కుటుంబంలో అపురూపంగా పెరిగిన చెల్లెలు రోమాగా ఆమె నటించింది.

తెలుగు ఆడపడుచుగా..

2001లో స్రవంతి రవికిషోర్‌ కోసం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'నువ్వు నాకు నచ్చావ్‌' పేరుతో ఒక ప్రేమకథ రాశారు. విజయభాస్కర్‌ దర్శకత్వంలో ఆ కథను సినిమా తీయాలని రవికిషోర్‌ ఒక కొత్త అమ్మాయి కోసం అన్వేషిస్తుంటే ఆర్తి కనిపించింది. అలా వెంకటేష్‌ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దొరకబుచ్చుకుంది. సెప్టెంబరు 6, 2001న విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోటి సంగీతం సమకూర్చిన వాన పాట 'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని' యువతరాన్ని ఉర్రూతలూపింది. అంతే.. ఆర్తి ఒక్కసారి టాప్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది.

సినిమా విజయవంతం కావడం వల్ల 2003లో ఇదే చిత్రాన్ని సెల్వభారతి దర్శకత్వంలో విజయ్‌-స్నేహ జంటగా తమిళంలో 'వసీహర' పేరుతో పునర్నిర్మించారు. అదే సినిమా కన్నడంలో 'గౌరమ్మ'గా వచ్చి బాగా ఆడింది. 'నువ్వు నాకు నచ్చావ్‌' చిత్ర విజయంతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఆర్తి హీరోయిన్‌గా 2002లో 'నువ్వు లేక నేను లేను' పేరుతో మరో ప్రేమకథను తెరకెక్కించింది. ఇందులో హీరోగా తరుణ్‌ నటించగా కాశీ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. ఇదీ సూపర్​ హిట్​గా నిలిచింది. 2002లో ఎన్టీఆర్​ సరసన 'అల్లరి రాముడు'లో నటించింది. అదీ బాగా ఆడటం వల్ల హిందీలోకి 'మై హూ ఖుద్దార్‌' పేరుతో డబ్‌ చేశారు.

'అల్లరి రాముడు' దర్శకుడు బి.గోపాల్‌ సారథ్యంలో చిరంజీవి సరసన 'ఇంద్ర' సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తే అది ఆర్తికి మంచి పేరుతెచ్చింది. ఈ సినిమా హిందీలో 'ఇంద్ర.. ది టైగర్‌' పేరుతో, తమిళంలో 'ఇంద్రన్‌' పేరుతో డబ్‌ చేసి విడుదల చేస్తే అక్కడా విజయాలే స్వాగతించాయి. ఇదే సినిమాను 'దాదా' పేరుతో బెంగాలీ భాషలో పునర్నిర్మించారు. అదే సంవత్సరం మరోచిత్రం 'నీ స్నేహం'లో ఉదయకిరణ్‌ సరసన ఆర్తి హీరోయిన్‌గా నటించింది. ఎమ్.ఎస్​‌ రాజు నిర్మించిన ఈ సినిమా బాగానే ఆడింది. దీన్ని కూడా బెంగాలీలో 'ప్రేమి' పేరుతో డబ్‌ చేశారు. అప్పటికే ఆర్తి పేరు టాలీవుడ్‌లో మారుమోగింది.

'ఇంద్ర' సినిమాలో చిరంజీవి, ఆర్తి అగర్వాల్​

ఆపై మహేశ్​బాబు సరసన 'బాబీ' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. చివరికి హీరో, హీరోయిన్లు ఇద్దరూ చనిపోయే ముగింపు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. హిందీలో ఈ సినిమాని 'డాగ్‌.. ది బర్నింగ్‌ ఫైర్‌' పేరుతో డబ్‌ చేశారు. 2003లో 'వసంతం' సినిమాలో మళ్లీ వెంకటేష్‌ సరసన ఆర్తి హీరోయిన్‌గా నటించింది. తమిళంలోనూ ఇదే చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడం విశేషం. ఇది 71 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. బి.గోపాల్‌ మరోసారి ఆర్తి అగర్వాల్‌ను బాలకృష్ణ సరసన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాలో నటింపజేశాడు. ఇందులో సొనాలిబింద్రే నటించింది. ఈ సినిమా ఫ్లాప్‌ కావడం ఆర్తికి ఒక రకంగా దెబ్బే.

ఆ తర్వాత రాజా పినిశెట్టి దర్శకత్వంలో 'వీడే' సినిమాలో రవితేజ సరసన రీమాసేన్‌తో కలిసి ఆర్తి నటించింది. ఇదొక సగటు సినిమా. 2004లో వి.యన్‌.ఆదిత్య దర్శకత్వంలో 'నేనున్నాను' చిత్రంలో నాగార్జున సరసన శ్రియ శరణ్‌కు తోడుగా ఆర్తి రెండో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విజయవంతమై 42 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. మరలా బి.గోపాల్‌ 'అడవి రాముడు' సినిమాలో ప్రభాస్‌ ప్రక్కన నటించే అవకాశం కల్పించాడు. ఈ సినిమా సాధారణంగా ఆకట్టుకుంది. ఇక 2005లో రవిబాబు దర్శకత్వంలో తరుణ్‌తో 'సోగ్గాడు' సినిమాలో ఆర్తి నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అయ్యింది. ఇక ముప్పలనేని శివ సినిమా 'సంక్రాంతి' సూపర్‌ హిట్టయ్యింది. కానీ అది మల్టీసారర్‌ సినిమా కావడం వల్ల ఆర్తి పాత్ర అందరిలో ఒకటిగా నిలిచింది.

ఆర్తి అగర్వాల్

అదే సంవత్సరం 'బంబర కన్నాళే' అనే తమిళ సినిమాలో శ్రీకాంత్‌ సరసన ఆర్తి నటించింది. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్‌కు ఆఫర్లు తగ్గడం మొదలయ్యాయి. తర్వాత 'ఛత్రపతి' సినిమాలో 'సుమ్మమ్మా సూరియా.. సూదంటూ రాయిలా..' పాట, 'నరసింహుడు' సినిమాలో 'రాజమండ్రికే రంగసానివి రంభ జాంగిరీ' వంటి ఐటెం సాంగుల్లో ప్రభాస్‌, ఎన్టీఆర్​ల సరసన నటించింది.

కమ్ముకున్న చీకట్లు

ఒకవైపు సన్నగిల్లిన సినిమా అవకాశాలు.. మరోవైపు నమ్ముకున్న చెలికాడు సొంతం కాలేకపోవడం.. అన్నిటికీ మించి చిన్న వయసు కావడం వల్ల ఆర్తి లేతమనసు తట్టుకోలేకపోయింది. 2005 మార్చి 22 అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఫినైల్‌ వంటి క్లీనింగ్‌ కెమికల్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా కోలుకుంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు ఒక యువ నటుడితో సంబంధం ఉందనే వదంతులు రావడం వల్ల మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిపింది. ఆర్తి కోలుకున్నాక 2006లో సునీల్‌ హీరోగా నటించిన 'అందాల రాముడు'లో నటించింది. తర్వాత రెండేళ్ల దాకా ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు.

ఆర్తి అగర్వాల్

ఉజ్వల వివాహం

ఆర్తి స్టార్‌ హీరోయిన్‌ హోదా ఎక్కువ కాలం నిలువలేదు. ఆమె కెరీర్‌ పతనం కావడానికి ఆ 'కుర్ర హీరో'తో ప్రేమలో పడటమే కారణమని వదంతులు బయలుదేరాయి. ఒక ఇంటర్వ్యూలో ఆర్తి మాట్లాడుతూ "వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు, పిచ్చిగా ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలనే ధ్యాసలో పడి వచ్చిన అవకాశాలను కాలరాసుకున్నాను" అని చెప్పింది. తర్వాత ఆమె అమెరికా వెళ్లి కొంతకాలం తల్లిదండ్రుల వద్ద గడిపింది.

తల్లిదండ్రుల సలహా మేరకు అమెరికాలో బ్యాంక్‌ ఉద్యోగం చేస్తున్న ఉజ్వల్‌ కుమార్‌ను.. హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌ మందిరంలో 2007 నవంబరు 21న వివాహమాడింది. హరియాణాకు చెందిన ఉజ్వల్‌ కుమార్‌ కుటుంబీకులు ఆర్తి కుటుంబానికి దూరపు బంధువులు. ఈ పెళ్లి జరిగినప్పుడు ఆర్తి సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ వారి 'గోరింటాకు' సినిమాలో నటిస్తూ ఉంది. పెద్దల సమక్షంలో పెళ్లయ్యేదాకా నిర్మాతలకు గానీ, ఫిలిం పరిశ్రమకు గానీ వివాహ విషయం తెలియదు. కానీ వారి వివాహ జీవితం ఎంతో కాలం నిలువలేదు. 2009లో పోసాని కృష్ణమురళి సినిమా 'పోసాని జెంటిల్మన్‌'లో ఆర్తి నటించింది.

ఆర్తి అగర్వాల్

స్థూలకాయం తగ్గాలని

ఆర్తి పెళ్లయ్యాక బాగా బరువు పెరిగింది. సినిమా అవకాశాలు శూన్యం. లైపోసక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే అటు బరువు తగ్గడమే కాకుండా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు దూరమవుతాయని భావించి.. అమెరికా వెళ్లి న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీ ఆసుపత్రిలో చేరి ఆపరేషన్‌ చేయించుకుంది. అదే రోజు(మే 15, 2015) ఆర్తి నటించిన 'రణం-2' సినిమా విడుదలైంది. ఆ తర్వాత గుండె పోటుకు గురై జూన్‌ 6, 2015 ప్రాణాలు విడిచింది.

శివనాగు దర్శకత్వంలో 'జంక్షన్‌లో జయమాలిని' సినిమాలో ఆర్తి ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. భరత్‌ పారేపల్లి 'నీలవేణి' సినిమాలో ఆర్తి అప్పటికే నటిస్తోంది. "చూస్తుండండి. నేను జూన్‌ 20న స్లిమ్‌గా మారి అమెరికా నుంచి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తా. షూటింగు పెట్టుకోండి" అని చిత్ర యూనిట్‌తో చెప్పి వెళ్లిన ఆర్తి అనూహ్యంగా మృతి చెందింది.

ఇదీ చూడండి... ఫోర్బ్స్​ జాబితాలో అక్షయ్ కుమార్ ఒక్కడే

ABOUT THE AUTHOR

...view details