హిందీ చిత్రాలైనా, తెలుగు చిత్రాలైనా, వెబ్ సీరీస్ అయినా దర్శకుడు చెప్పినట్లు చేస్తూనే తన పాత్రను పండిస్తుంది. నటనను ప్రాణంగా భావిస్తుంది. పాత్రల్లో ఒదిగిపోయి మురిపిస్తుంది, అలరిస్తుంది. తనే కైరా అడ్వాణి. తెలుగులో 'భరత్ అనే నేను'లో వసుమతి అనే మధ్య తరగతి అమ్మాయిగా నటించింది. 'వినయ విధేయ రామ'లో అమ్మ మాటని హద్దుదాటని సీత పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి 'లక్ష్మీబాంబ్'లో స్నేహ కోస్లాగా నటిస్తుంది. 'ఇందూ కి జవానీ', 'షేర్షా', 'భూల్ భులయ్యా2' లాంటి చిత్రాల్లోను నటిస్తోంది. ఆ మధ్య ఓ ముఖాముఖి సమావేశంలో తన గురించి ఆసక్తికరమైన, మనసులోని మాటలు చెప్పింది. అవేంటో చూద్దాం..
మీపై అధిక ప్రభావం చూపించేదెవరు?
నా తల్లితండ్రులు. వారు సంతోషంగా, సుఖంగా ఉండటమే నా లక్ష్యం. సినిమాల్లో కథలాగే నాక్కూడా కొంచెం అనుబంధాలు ఆపాయ్యతలు ఎక్కువే. మీరు దాన్ని సెంటిమెంట్ అనుకోవచ్చు. నన్ను అమ్మకూచి అని కూడా అనొచ్చు.
సినిమా పరిశ్రమ నుంచి ఏమి నేర్చుకున్నారు?
చాలామందిలో నేను గమనించిన విషయం సహనం, ఓపిక. మనం చేసే పని నిజాయతీగా చేసుకొంటూ పోతే ఏదో ఒకరోజు దాని ఫలితం వస్తుంది. అప్పటి వరకు మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
మీకు ఇష్టమైన నటులు, చిత్రాలు?
దీపికా పదుకొణె, అలియాభట్లు అంటే చాలా ఇష్టం. బాగా ఇష్టమైన చిత్రం 'కభి ఖుషి కభీ ఘం'. ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. 'పద్మావత్' చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలని ఉంది. అలాగే 'గల్లీ బాయ్' నటుడు రణ్వీర్ సింగ్తో కలిసి నటించాలనే ఆశ.
మిమ్మల్ని విమర్శించే వాళ్లకి ఏం సమాధానం చెప్తారు?
మనం చేసే పని చేస్తాం. వాళ్లు చేసేది వాళ్లు చేస్తారు. పొగిడినా, తిట్టినా పెద్దగా పట్టించుకోను.