ఈ ఏడాది స్మార్ట్ఫోన్ కంపెనీలు భారీ ఎత్తున కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో షియోమీ, రియల్మీ, వన్ప్లస్, శాంసంగ్ కంపెనీలు పలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇందులో ప్రీమియం ఫోన్ల నుంచి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల వరకు ఉన్నాయి. మరి ఆయా కంపెనీలు విడుదల చేయనున్న కొత్త మోడళ్లు ఏవి? వాటి ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? విడుదల తేదీ ఎప్పుడు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
రెడ్ మీ నోట్ 10 సిరీస్..
భారత్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఏదైనా ఉందంటే అది రెడ్ మీ నోట్ సిరీస్ అనే చెప్పాలి. గత ఏడాది విడుదలైన నోట్ 9 సిరీస్కు శాంసంగ్, రియల్మీ వంటి సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంది. దీనితో ఈసారి నోట్ 10ను సరికొత్త ఫీచర్లతో తీసుకువచ్చేందుకు సిద్ధమైంది షియోమీ.
ఈ సిరీస్లో.. నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్ పేర్లతో మూడు వేరియంట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మార్చి 4న ఈ మూడు మోడళ్లను ఒకేసారి విడుదల చేస్తుందా? తొలుత ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లను మాత్రమే తీసుకొస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ మోడళ్లు 5జీతో వస్తాయా అనే విషయంపైనా ఇంకా స్పష్టత లేదు. అయితే వీటిలో ఒక మోడల్ మాత్రం 108 మెగా పిక్సెల్ కెమెరాతో రానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నోట్ 10 సిరీస్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 700, 732జీ ప్రాసెసర్లతో రావచ్చని టెక్ వర్గాల అంచనా.
వన్ ప్లస్ 9 సిరీస్..
వన్ ప్లస్ 8టీ ఆవిష్కరించినప్పటి నుంచే వన్ ప్లస్ 9 సిరీస్పై టెక్ వర్గాల్లో ఉహాగానాలు మొదలయ్యాయి. ఈ సిరీస్లోనూ మూడు వేరియంట్లు ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి. వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో వంటి మోడళ్లను ప్రీమియం సెగ్మెంట్లో తీసుకురానున్నట్లు సమాచారం. మూడో వేరియంట్ను బడ్జెట్ ధరలో తీసుకువచ్చే అవకాశాలున్నాయి. బడ్జెట్ వేరియంట్ను ప్లస్ 9ఈ, 9ఆర్, 9 లైట్ (ఈ మూడింటిలో ఏదో ఒకటి) పేరుతో రావచ్చని తెలుస్తోంది.