సామాజిక మాధ్యమాలు, ఓటీటీలకు కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనలను అమలు చేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయని ఆయా పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫేస్బుక్ లాంటి దిగ్గజ సంస్థలతో పోలిస్తే చిన్న కంపెనీలకు ఇది కష్టతరమవుతుందని చెబుతున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ, ఓటీటీ సంస్థలు చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్, నోడల్, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతకర పోస్టులపైన వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి. ఈ నిబంధనలన్నీ 50లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సంస్థలకే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఫేస్బుక్ లాంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ నిబంధనలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపాయి.
మిశ్రమ అభిప్రాయాలు..
కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఫిర్యాదుల పరిష్కారం, నకిలీ వార్తలు, యూజర్ల ఆన్లైన్ భద్రతకు వీటితో పరిష్కారం లభిస్తుందని కొందరు చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం కొత్త నిబంధనల వల్ల చిన్న సంస్థలకు ఖర్చులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.