అతి చిన్న ప్రాణులను సూక్ష్మజీవులు లేదా మైక్రోబులు అంటారు. ఇవి కంటికి కనబడవు. సూక్ష్మదర్శిని ( మైక్రోస్కోపు) ద్వారా మాత్రమే చూడగలం. అసలు ఈ ప్రాణులేంటి? ఇవెక్కడ జీవిస్తాయి?? మన నిత్య జీవితంలో వీటి పాత్ర ఎలా ఉంటుంది? మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన విశాలాక్షీ అరిగెల ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. కొన్ని రకాల మైక్రోబులు ఎలా ఉంటాయో.. ఎక్కడ ఉంటాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
- మంచి నీటి చెరువులను, సరస్సులను ఎప్పుడైనా చూశారా? వాటి ఉపరితలం మీద ఆకుపచ్చటి ఒకలాంటి తెట్టెలు మెల్లిగా కదులుతూ ఉంటాయి. అవేమిటో తెలుసా? ఆకుపచ్చగా ఉంది కాబట్టి ఒక రకమైన మొక్క అనుకుంటారు. కానీ కాదు. ఒక రకం ప్రాణుల సమూహాం నీటి మీద అలా విహరిస్తూ ఉంటుంది. నీటి మీద పెరిగే ఈ నాచును ఆల్గే అని పిలుస్తారు.
- కాచిన పాలలో నిన్నటి పెరుగు కొద్దిగా కలిపితే ఏం జరుగుతుందో మనకు తెలుసు, కొద్ది గంటలకే అవి పేరుకుని చిక్కటి పెరుగుగా మారతాయి. ఇది తరతరాలుగా మానవుడికి తెలిసిన చిట్కానే. అయితే.. పాలు ఎందుకని ఇలా రూపాంతరం చెందుతాయి? మనం వేసిన ‘తోడు’లో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలను ఇలా పెరుగుగా మార్చేస్తుంది.
- బ్రెడ్డును కొన్ని రోజులు గాలి తగిలేలా వదిలేస్తే అది బూజు పడుతుంది. రొట్టె మీద నల్లగా పెరిగే మెత్తటి ఈ బూజే ఫంగస్ సూక్షప్రాణులు.
- ప్రపంచం అంతటా విస్తరించిన ప్రమాదకర వ్యాధుల్లో మలేరియా ఒకటి. దోమల ద్వారా వ్యాప్తి చెందే ప్రొటోజోవా తరగతి సూక్ష్మజీవుల వల్ల ఈ చలిజ్వరం వస్తుంది.
- మన ఇంట్లో ప్రతి నిత్యం బోలెడు చెత్త తయారు అవుతుంది. అలాగే ఇంటి ఆవరణలో చచ్చిపోయిన మొక్కలు ఉంటాయి. ఏ పిల్లినో, కుక్కో చనిపోతుంది. ఇవన్నీ కుళ్లి దుర్గంధం వ్యాపింపజేస్తాయి. వీటిని కుళ్లబెట్టేవి కూడా మైక్రోబులే. ఇలా కుళ్లిన చెత్తా చెదారం, జంతుకళేబరాలు చివరకు భూమిలో కలిసిపోతాయి. అలా నేల సారవంతం అవుతుంది.
- పల్లెటూళ్లలో పశువుల పేడను ట్యాంకులో నిల్వ ఉంచి, దాని ద్వారా వెలువడే గ్యాసును వంట చేసుకునేందుకు ఇంధనంగా వాడతారు. ఈ గోబర్ గ్యాసును తయారు చేసేవీ మైక్రోబులే.