ఐఐటీ మద్రాస్, అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ బయెరియాక్టర్ సాయంతో మనిషి మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో ఆర్గనాయిడ్స్గా పిలిచే ఈ బ్రెయిన్ టిష్యూస్ల వృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. దీని ద్వారా క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి ప్రమాదకర వ్యాధుల నివారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఆ సమస్యను పరిష్కరించారు..
మానవ శరీరానికి సంబంధించి ఏ విషయాన్ని అయినా తెలుసుకునే క్రమంలో సెల్ కల్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ వ్యాధికైనా చికిత్స లేదా ఔషధం కనుగొనడంలో కణాలపై పరిశోధన ఎంతో ముఖ్యం. కణజాలాన్ని అభివృద్ధి చేసేందుకు ఇన్క్యుబేషన్, ఇమేజింగ్ సహా కణాలను భౌతికంగా ఇమేజింగ్ ఛాంబర్లోకి బదిలీ చేసేందుకు వేర్వేరు ఛాంబర్లు అవసరం. అయితే ఈ క్రమంలో దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటీ, ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ 3డీ ప్రింటెడ్ బయోరియాక్టర్ను రూపొందించారు. మైక్రో ఇన్క్యుబేటర్, ఇమేజింగ్ ఛాంబర్లను ఒకే పరికరంలోకి తీసుకువచ్చారు. దీని ద్వారా కణాల వృద్ధిని గమనిస్తూ దీర్ఘ కాలం పరిశోధన జరిపేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు.
ఆరుగురు సభ్యుల బృందం
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ఇటీవల బయోమైక్రోఫ్లూయిడిక్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఐఐటీ మద్రాస్ నుంచి ఇమ్రాన్ ఖాన్, ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్, ఎంఐటీ నుంచి క్లోయ్ డెలెపైన్, హేలే సాంగ్, విన్సెంట్ ఫామ్, ప్రొఫెసర్ మ్రిగంకా సుర్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.