నిత్యం ఉరుకులు పరుగులతో తీరిక లేని జీవితం గడుపుతున్న మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన చిరు పిట్ట ట్విట్టర్. మరి ఆ కబుర్ల టెక్ పక్షి తెచ్చిన తొలి ట్వీట్ ఏంటో తెలుసా? ''జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్'' అంటూ తొలిసారి మనందరినీ పలకరించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ మార్చి 21, 2006లో ఆ ట్వీట్ చేశారు.
ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైన ట్విట్టర్లో తొలి ట్వీట్ అంటే ప్రత్యేకమేగా మరి. అందుకే దీన్ని జాక్ డోర్సీ 'వాల్యుయబుల్స్ బై సెంట్' వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షల మంది ట్వీట్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.18.30 కోట్లు) ఇచ్చేందుకు ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చారు.