కొన్నేళ్లుగా ఆన్లైన్ సమాచార శోధనలో గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా గూగుల్కు చాట్జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సిద్ధమవుతోంది. చాట్జీపీటీతో కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధానికి గూగుల్ సైతం తన అస్త్రశస్త్రాలతో సన్నాహాలు చేసుకుంటోంది. బార్డ్ పేరిట కృత్రిమ ఆధారిత చాట్బోట్ను సిద్ధం చేస్తోంది.
అంతరిక్ష ఆవిష్కరణలు సైతం..
ప్రస్తుతం బార్డ్ను విశ్వసనీయ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం ఓ బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళిక, ఇంట్లోని ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు.. వంటి చిట్కాలను సైతం బార్డ్ అందించగలుగుతుందని గూగుల్ తెలిపింది. 'సృజనాత్మకత, ఉత్సుకతకు బార్డ్ ఓ వేదికగా మారుతుంది' అని సుందర్ పిచాయ్ బ్లాగ్ పోస్ట్లో రాసుకొచ్చారు.
అప్రమత్తమైన గూగుల్..
చాట్జీపీటీని ఓపెన్ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లోనే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్ఏఐకి అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్.. బార్డ్కు సంబంధించిన ప్రకటన చేసింది. తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజినీర్లనూ అప్రమత్తం చేసింది. చాట్జీపీటీకి పోటీనిచ్చేలా బార్డ్ అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించింది. అట్లాస్ ప్రాజెక్టు పేరిట గూగుల్ ఈ బార్డ్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.