భారతీయ పరిశోధకురాలు అరుదైన ఘనత సాధించారు. తక్కువ ధరలో.. రెండు మిల్లీమీటర్లు పొడవు, 10 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే అతిచిన్న అసిడిటీ సెన్సార్ను అభివృద్ధి చేశారు. ఈ పీహెచ్ సెన్సార్ను.. తయారీ సమయంలోనే ఫుడ్ ప్యాకెట్లలో పెట్టి.. బయట నుంచే ప్రత్యేక స్కానర్ల ద్వారా ఫలితం తెలుసుకోవచ్చు. అమెరికా టెక్సాస్లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కెంగ్డౌలి చవాంగ్ ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
ఈ పరికరం వల్ల ఆహారం ఎప్పుడు పాడైందో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా పరిశ్రమలు పెద్ద పెద్ద సెన్సార్లను వినియోగిస్తున్నాయి. అవి దాదాపు ఒకటి నుంచి ఐదు అంగుళాల వరకు పొడవు ఉంటాయి. ఆహారం తాజాగా ఉందా లేదా పాడైపోయిందా అని తెలుసుకునేందుకు.. ఎంత ఆమ్లంగా లేదా క్షారంగా ఉందో కొలవడానికి ప్రతి ప్యాకెట్లో ఈ సెన్సార్లను చేర్చడం చాలా కష్టమవుతుంది. చవాంగ్ అభివృద్ధి చేసిన అతిచిన్న సెన్సార్లతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
"పీహెచ్ సెన్సార్లు.. వైర్లెస్ రేడియో ఫ్రీక్వెన్వీ ఐడెంటిఫికేషన్ పరికరాల్లా ఉపయోగపడతాయి. అంటే ఎయిర్పోర్టుల్లో మన లగేజ్ను చెక్ చేసిన తర్వాత ఇచ్చే ట్యాగుల్లాగా పనిచేస్తాయి. ప్రతిసారి మన ఫుడ్ ప్యాకెట్.. షిప్పింగ్ లాజిస్టిక్స్ సెంటర్లు, హార్బర్లు, గేట్లు లేదా సూపర్ మార్కెట్లు లాంటి చెక్ పాయింట్స్ను దాటినప్పుడు.. ఈ ఆసిడిటీ సెన్సార్ స్కాన్ అవుతుంది. అనంతరం ఫుడ్ ప్యాకెట్లో ఉన్న పీహెచ్ లెవెల్స్ ట్రాక్ చేసిన సమాచారాన్ని సర్వర్కు చేరవేస్తుంది."
-- కెంగ్డౌలి చవాంగ్, పరిశోధకురాలు
ఆహారం రైతుల దగ్గర నుంచి వినియోగదారుల వరకు వచ్చే వరకు దాన్ని మొత్తం ప్రయాణాన్ని, పీహెచ్ లెవెల్స్ను ఈ సెన్సార్లు పర్యవేక్షిస్తాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యూనైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్కు చెందిన చవాంగ్.. ఎలాగైన ఆహార వృథాను ఆపాలనే ఆలోచనలో నుంచి ఈ ఆవిష్కరణ సాధ్యమైందని తెలిపారు.
" నేను నాగాలాండ్లో పుట్టి పెరిగాను. అక్కడ ఆహారం వృథా చేయడం ద్వారా పిల్లల్లో పొషకాహార లోపం తలెత్తుతుంది. ఆ వృథా అయిన ఆహారాన్ని భర్తీ చేయడానికి రైతులు మరింత శ్రమించాల్సి వస్తోంది. ఇలా ఫుడ్ వృథా చేయడం వల్ల ఆహార అభద్రత తలెత్తుతుంది. పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. దీంతో, ఎలాగైనా అహార వృథాను ఆపాలనుకున్నాను. దాని ఫలితమే పీహెచ్ సెన్సార్. ఈ పరికరం ధర తక్కువే ఉంటుంది. సులభంగా తయారు చేయొచ్చు. ఒకసారి వాడిన తర్వాత పారేయొచ్చు."
-- కెంగ్డౌలి చవాంగ్, పరిశోధకురాలు
పీహెచ్ లెవెల్స్ అంటే..
అహారం తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి పీహెచ్ లెవల్స్ ఉపయోగపడతాయి. ఏదైనా పదార్థం లేదా ద్రావణంలో ఉండే హైడ్రోజన్ అయాన్ల సాంద్రత ద్వారా పీహెచ్ స్థాయిని కొలుస్తారు. ఉదాహరణకు ఆహారంలో సాధారణ స్థాయి కన్నా పీహెచ్ లెవెల్ ఎక్కువగా ఉంటే.. పాడైపోయినట్లు లెక్క. ఎందుకంటే ఎక్కువ పీహెచ్ ఉంటే.. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి.
తాను అభివృద్ధి చేసిన పీహెచ్ సెన్సార్ను చేపలు, పండ్లు, పాలు, తేనె లాంటి పదార్థాల్లో విజయవంతంగా పరీక్షించినట్లు చవాంగ్ తెలిపారు. ఈ పరికరం తయారీలో తక్కువ మొత్తంలో బయో కాంపాటిబుల్ మెటీరియల్స్ను, ఫ్లెక్సిబుల్ ఫిల్మ్లపై ప్రింటింగ్ చేసే టెక్నాలజీని ఉపయోగించినట్లు వెల్లడించారు.
ఈ ప్రింటింగ్ పద్ధతి అచ్చం న్యూస్ పేపర్లు ప్రింట్ చేసినట్టే ఉంటుందని.. దీని కోసం ఖరీదైన పరికరాలు, సెమీకండక్టర్ శుభ్రపరిచే వాతావరణం అవసరం లేదని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేసీ చియాఓ తెలిపారు. ఈయనే చవాంగ్ పీహెచ్ సెన్సార్ అభివృద్ధి చేయడంలో సహాయం అందించారు. ఇక, చవాంగ్ కృషికి గాను 2022లో జరిగిన ఐఈఈఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్) బిగ్ ఐడియాస్ కాంపిటీషన్లో ఆమెను సత్కరించారు.