టిఫిన్ చేయాలని అనిపిస్తే వెంటనే మనకి తినాలని అనిపించే వంటకం దోశ. వీటిలో ఎన్నో రకాలు ఉన్నా.. మసాలా దోశది ప్రత్యేక స్థానం. కర్ణాటకలో పుట్టిన ఈ వంటకం ఇప్పుడు దేశంలోని హాట్ ఫేవరెట్ ఫుడ్స్లో ఒకటి. ఈ మసాలా దోశకే కేరాఫ్గా ఎన్నో టిఫిన్ సెంటర్లు వెలిశాయి. మరి ఈ మసాలా దోశను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి. బయట టిఫిన్ సెంటర్లలో వచ్చే రుచే రావడానికి ఏం చేయాలంటే..
కావాల్సినవి :అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు, ఉప్పు, బియ్యం, మినపప్పు, అటుకులు, ఉప్పుడు బియ్యం, మెంతులు, శెనగపప్పు, పసుపు, ఆవాలు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, బంగాళదుంపలు.
తయారు చేసే విధానం..
ముందుగా వెల్లుల్లి, నానపెట్టిన ఎండు మిరపకాయలు, ఉప్పుతో మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత బియ్యం, మినపప్పు, అటుకులు, ఉప్పుడుబియ్యం, మెంతుల మిశ్రమాన్ని ఆరుగంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత రుబ్బి 6 నుంచి 8 గంటల దాకా ఆగాలి.
కడాయిని వేడి చేసి.. అందులో నూనె వేయాలి. ఆవాలు, శెనగపప్పు, పసుపు, మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించి చిదిమేసిన బంగాళదుంప వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం వేసి మగ్గించుకుంటే దోశెలోకి మసాలా రెడీ అవుతుంది.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండితో దోశెలు వేసి.. దానిపై మనం చేసుకున్న మిర్చి మసాలాను రాసి.. ఆ తర్వాత బంగాళదుంపతో తయారు చేసుకున్న మసాలాను దాని మీద వేసుకుంటే నోరూరే మసాలాదోశె రెడీ.
ఇలా దేశెల పిండితో మరో నాలుగు రకాల వంటలను కూడా తయారు చేసుకోవచ్చు.
మసాలా పునుగులు..
కావాల్సినవి :క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, కరివేపాకు, నూనె.
తయారీ :దోశెల పిండిలో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఓ కడాయిలో నూనె మరిగించి అందులో ఈ పిండి మిశ్రమాన్ని ఉండల్లా వేసుకుని ఫ్రై చేసుకుంటే మసాలా పునుగులు సిద్ధం.