ఊపిరి పోసే గాలి కసిగా ఉసురు తీసేయడాన్ని మించిన విషాదం ఉందా? 36 ఏళ్లనాటి భోపాల్ మహా విషాదాన్ని స్ఫురణకు తెస్తూ సాగరతీర విశాఖ నగరంలో విషరసాయన వాయువు 11 మంది అభాగ్యుల ఆయువు తోడేసి, వందల మందిని ఆసుపత్రుల పాల్జేసిన ఘోరం గుండెల్ని మెలిపెడుతోంది. కొన్ని కీలక రసాయనాల సరఫరా నిరంతరాయంగా సాగకపోతే అనేక ప్రాణాధార ఔషధాల తయారీ సాధ్యం కాదంటూ, తమ పరిశ్రమనూ నిత్యావసరంగా గుర్తించి లాక్డౌన్ నుంచి మినహాయింపునివ్వాలని ఏప్రిల్ రెండోవారంలో ఇండియన్ కెమికల్ కౌన్సిల్ కేంద్రాన్ని కోరింది. అలా లాక్డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి నడిరేయి స్టెరైన్ గ్యాస్ లీకై సృష్టించిన బీభత్సం మాటలకందనిది. పశుపక్ష్యాదులు, పెంపుడు జంతువులూ విషవాయు ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మరణాన్ని శ్వాసిస్తూ నడివీధుల్లో ఒరిగిపోయిన పిన్నలూ పెద్దలు అనుభవించిన నరకయాతన చెప్పనలవికాదు.
నిరంతరం నిర్వహణ అవసరమైన ప్లాంటుకు లాక్డౌన్ పెనుశాపమైందన్న వాదనతో ఎల్జీ పాలిమర్స్ తన బాధ్యతను దులపరించేసుకోలేదు. వందేళ్లు పైబడిన చక్కెర కర్మాగారం పరిశుభ్రత కొరవడిన కారణంగా అగ్ని ప్రమాదానికి లోనై 14మంది సిబ్బందిని బలిగొందంటూ బహుముఖంగా భద్రతాంశాలపై దృష్టి సారించాలని మొన్న జనవరిలోనే ఎల్జీ పాలిమర్స్ సంస్థాగత వార్తాలేఖ వెలువరించింది. చట్టబద్ధ నిబంధనలకు కట్టుబడుతూ పర్యావరణ ఆరోగ్య భద్రతాంశాల్లో అత్యుత్తమ పద్ధతులు పాటించి, సామాజిక బాధ్యతగా స్థానికుల్లోనూ వాటి మెరుగుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. వాటిని నిర్లక్ష్యం చెయ్యబట్టే ఇంత ఉత్పాతం జరిగిందన్నది నిజం. నష్ట పరిహారంలో సహేతుకంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, భోపాల్ అనుభవాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి!