కరోనా కట్టడే లక్ష్యమంటూ విధించిన లాక్డౌన్ల దరిమిలా అసంఖ్యాక శ్రమజీవుల బతుకులే తలకిందులయ్యాయి. అనూహ్యంగా మారిపోయిన స్థితిగతుల మూలాన విశ్వవ్యాప్తంగా జీవనోపాధి కోల్పోయినవారి సంఖ్య 270 కోట్లుగా ఐక్యరాజ్యసమితి నివేదిక నిగ్గుతేల్చింది. అందులో అసంఘటిత రంగ కార్మికులదే పెద్దవాటా. దేశంలో నిరుడు ఫిబ్రవరి నాటికి ఏదోఒక పని చేస్తూ పొట్టపోసుకుంటున్న నిత్య శ్రామికుల్లో మూడొంతుల మంది లాక్డౌన్ల వేళ వీధిన పడ్డారు. వారిలో 20 శాతందాకా గత అక్టోబరు-డిసెంబరు నాటికీ ఏ పనీ దొరక్క పస్తులతో గడిపే దురవస్థలో కుములుతున్నారు. ఆరు పౌర సంఘ సంస్థలతో కలిసి అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం 12 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనం వెల్లడిస్తున్న చేదునిజాలివి.
పోషకాహార లోపాలు..
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ, పశ్చిమ్ బంగ వంటిచోట్ల చేపట్టిన అధ్యయనం- లాక్డౌన్ల అనంతరం క్షేత్రస్థాయిలో చెదరని నైరాశ్య తీవ్రతను కళ్లకు కడుతోంది. సర్వే సమయానికి దారిద్య్రరేఖ దిగువన అలమటిస్తున్న మూడొంతుల కుటుంబాలకు దక్కాల్సిన వాటికన్నా ఆహార ధాన్యాల సరఫరాలు తరుగుపడ్డాయి. పర్యవసానంగా పోషకాహార లోపాలూ పెచ్చరిల్లుతున్నాయి. లాక్డౌన్ల ఉపసంహరణ తరవాతా తాము తీసుకునే ఆహార పరిమాణం పెరగనే లేదని పల్లెల్లో 15శాతం, పట్టణాల్లో 28శాతం కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదభరిత దృశ్యం ప్రభుత్వపరంగా తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది. కాలపరిమితి లేని ఉపాధికి హామీ ఇవ్వాలన్న డిమాండ్లు గతంలోనే వెలుగుచూశాయి. చల్లారని ఆకలి మంటల దృష్ట్యా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచడంతోపాటు, వాస్తవిక అవసరాలకు అనుగుణంగా పట్టణ ఉపాధి పథకానికీ రేపటి బడ్జెట్లో చోటు పెట్టాలన్న తాజా సూచనలు సహేతుకమైనవి.