తెలంగాణ

telangana

పాటన్​లో మామాఅల్లుళ్ల ఫైట్- మాజీ సీఎం కొడుకు గట్టి పోటీ! బెట్టింగ్‌ యాప్‌ కేసు ప్రభావం చూపుతుందా?

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 8:15 AM IST

Chhattisgarh Elections Paatan Seat : మరో రెండురోజుల్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత ఎన్నికలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. 20 స్థానాల్లో జరగనున్న తొలి విడత పోలింగ్‌లో దుర్గ్ జిల్లాలోని పాటన్ సీటుపై అందరి దృష్టి పడింది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున ఆయన అల్లుడు విజయ్‌ బఘేల్‌తో ద్వంద పోరు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఓబీసీ ఓట్ల ప్రభావం ఉన్న పాటన్ స్థానంలో ఈసారి జనతా కాంగ్రెస్​ కీలకంగా మారింది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం కూడా ఓట్లపై ప్రభావం చూపనున్నట్లు సమాచారం.

Triangular Competence in Chhattisgarh Patan Constituency
Triangular Competence in Chhattisgarh Patan

Chhattisgarh Elections Paatan Seat :ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తం 90 శాసనసభ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో 20స్థానాల్లో ఈనెల 7న పోలింగ్ జరగనుంది. మిగతా సీట్లతో పోలిస్తే దుర్గ్ జిల్లాలోని పాటన్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘేల్​, బీజేపీ నుంచి ఆయన అల్లుడు, దుర్గ్​ ఎంపీ విజయ్ బఘేల్‌ మరోసారి పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో ఎప్పటి మాదిరిగా మామ-అల్లుళ్ల మధ్యే పోరు ఉంటుందని అంతా భావిస్తున్నప్పటికీ.. జనతా కాంగ్రెస్ నుంచి వారికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓబీసీకి చెందిన రెండువర్గాల ఓట్ల ప్రభావం ఉన్న ఈ స్థానంలో జనతా కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మొదటి సీఎం అజిత్ జోగి తనయుడు అమిత్ జోగి బరిలో ఉన్నారు. విజేతను నిర్ణయించడంలో ఆయన కీలకంగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'వారిపై ఈడీ విచారణ ఎందుకు జరపట్లేదు..'
పాటన్ నియోజకవర్గం నుంచి సీఎం భుపేశ్ బఘేల్ ఇప్పటివరకు ఒక్క 2008లో మినహా 5సార్లు విజయం సాధించారు. మరోసారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసుకు సంబంధించి ఈడీ చేసిన ఆరోపణలను బఘేల్ తోసిపుచ్చారు. ఈడీని పక్షపాత సంస్థగా పేర్కొన్న ఆయన మాజీ సీఎం రమణ్‌ సింగ్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ నేత రమణ్‌ సింగ్, ఆయన సతీమణి, కుమారుడిపై ఓ చిట్‌ ఫండ్ సహా పలు కేసుల్లో అవినీతి ఆరోపణలున్నాయని ఆరోపించారు. వారిపై ఈడీ ఎందుకు విచారణ చేయట్లేదని బఘేల్ ప్రశ్నించారు.

'బఘేల్​ ఒక ప్రీపెయిడ్​ సీఎం..'
అధికార కాంగ్రెస్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బఘేల్‌ను ప్రీపెయిడ్ సీఎంగా అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు సమస్య ఉందని, అధికార యంత్రాంగంతో పేద గిరిజనుల మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపుతామని అమిత్‌ షా హెచ్చరించారు. ఇక పాటన్ సీటులో ఈసారి విజయ్‌ బఘేల్ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'మామ-అల్లుళ్ల మ్యాచ్​ ఫిక్సింగ్​..'
మరోవైపు పాటన్ స్థానంలో ఈసారి కీలకంగా మారనున్నట్లు భావిస్తున్న జనతా కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ జోగి.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు రెండుపార్టీలు అవినీతి ఆరోపణలు చేసుకుంటాయని.. అధికారం చేపట్టిన తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవని విమర్శించారు. పాటన్ ఎన్నిక మామ-అల్లుళ్ల మధ్య ఎప్పటిలానే మ్యాచ్ ఫిక్సింగ్ అని అమిత్‌ జోగి ఆరోపించారు. పాటన్ స్థానంతోపాటు మిగతా చోట్ల కూడా జనతా కాంగ్రెస్ గెలుపు ఖాయమని అమిత్‌ జోగి ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల వేళ మావోయిస్టుల దాడులు- రాజకీయ పార్టీల్లో టెన్షన్​ టెన్షన్​!

BJP Tough Seats In Chhattisgarh : ఆ 9 స్థానాలే టార్గెట్​.. 23 ఏళ్లుగా గెలవని బీజేపీ.. ఈసారి పక్కా ప్లాన్​తో..

ABOUT THE AUTHOR

...view details