సంక్రాంతి ఒక ప్రత్యేక పండగ.. తెలుగువాళ్ల తెలుగు పండగ. నిజం పండగ సంక్రాంతే. ఇతరేతర పండగలన్నీ ఏదో ఒక దేవుడికో, రాక్షస సంహారానికో లింకు ఉన్న పండగలే. ఇదొక్కటే- ప్రజల పండగ, రైతుల పండగ, మహిళల పండగ, పిల్లల పండగ.
కోడి పందాలకు బర్డ్ ఫ్లూ భయం
కోడిపందాలకూ ఈసారి సమస్య వచ్చిపడింది. గుంపులుగా జనం రావడానికి కరోనా కత్తి ఇంకా తలమీద వేలాడుతూనే ఉంది. అదియునూ గాక బర్డ్ఫ్లూ భయం కోడిపుంజులకూ పట్టుకుంది. ఒక పుంజును చూసి మరో పుంజు ట్రంప్లా రెచ్చిపోయి పోరాడే బదులు, చివరిదాకా పొడుచుకు చచ్చే బదులు ఒకదాన్ని చూసి మరోటి ఈక ముడిచి పారిపోయే పరిస్థితి నెలకొంది. పందెంకోడిని అరెస్టు చేస్తే బర్డ్ఫ్లూ అంటుకుంటుందేమోనని పోలీసులకు భయం. బర్డ్ఫ్లూ మనదగ్గర లేదయ్యా, హాయిగా(కోడిపందాలు) ఉండొచ్చునంటున్నాయి తెలుగు సర్కార్లు. (కోళ్లూ మాస్కులు కట్టుకుని శానిటైజ్ చేసుకుని పోరాడవచ్చు.)
‘రాజకీయాలతో పోలిక లేని పండగ ఉంటుందా?
కళ్లంటూ ఉంటే చూసీ, వాక్కంటూ ఉంటే రాసి’ అన్నట్టు గమనిస్తే రాజకీయాలతో పోలిక లేని పండగంటూ ఉండదు- సంక్రాంతి మరీనూ. ధనుర్మాసం ఆరంభానికి ముందే దిల్లీ సరిహద్దుల్లో భోగిమంటలు నలుదిశలా ఆరంభమయ్యాయి. జేగీయమానంగా వెలుగొందుతున్నాయి. చలిమంటకు తోడు కడుపుమంట. తమిళులు ధనుర్మాసాన్ని మార్గళైమాస అంటారు. మార్గళి అంటే పొంగలి. సంక్రాంతి పొంగలి. సూర్యోదయంకన్నా ముందే ఆరగిస్తారు. దిల్లీలో మార్గళి వండకున్నా రోజూ లంగరు సాగుతోంది. లంగరంటే వంట. ఉచితంగా అంతా కలిసి భోంచేయడానికి వండే వంట.
యడుయూరప్ప పొంగలి వడ్డించేశారు
కర్ణాటకలో కూడా సంక్రాంతి మన సంక్రాంతిలాగే జరుపుతారు. (పాకిస్థాన్లోని సింధ్ నుంచి శ్రీలంక దాకా, అసోం నుంచి గుజరాత్ దాకా వేరువేరు పేర్లతో ఇదే పండగ చేస్తారు. అది వేరే సంగతి.) నిన్న భోగి రోజునే యెడియూరప్ప పొంగలి/మార్గళి వండేసి ఆశావహుల్లో కొందరికి వడ్డించేశాడు. నాకు నాకు నాకు నాకు అని మాయాబజార్ సినిమాలోలా ఎంత ఎగబడ్డా కూడా మిగతావారికి గొబ్బెమ్మలు, పతంగులు, ముగ్గుపిండి వగైరాలే మిగిలాయి.
ప్రజాస్వామ్యం ఎక్కువైందంట!
మరో మూడు నాలుగు నెలల్లో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.. ప్రతి ఏడాదీ మనదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లి ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అన్నీ మినీ జనరల్ ఎలక్షన్లే. అవి కాకపోతే గ్రామ పంచాయతీలకు, మండళ్లకు, జిల్లాలకు, నగర పాలికలకు.. వివిధ సొసైటీలకు ఎన్నికలే ఎన్నికలు. అవి తెరిపినిస్తే ఉప ఎన్నికలొస్తాయి. మన దగ్గరున్నంత ప్రజాస్వామ్యం మరో చోట వినం, చూడం. మొన్నొకాయన అదే చెప్పాడు ప్రజాస్వామ్యం ఎక్కువయిందని.. ఈ విషయంలో కాదులెండి. డిమాండు చేసేవాళ్లను చూస్తే ఆయనకు ఒళ్లు మంటట.. 'ధిక్కారమున్ సైతునా' అని. తమలాంటి కొద్దిమందికి తక్క ఇతరులెవరికీ ప్రజాస్వామ్యం అక్కర్లేదని ఆయన అభిభాష.
ఎవరి పతంగి ఎగురుద్దో?