నూతన విద్యావిధానంలో తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదన కీలకమైంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో(సీయూ) ప్రవేశాలన్నీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సన్నద్ధం కావాల్సిందిగా సీయూలకు సూచించింది. దేశంలో ఉన్నత విద్యాప్రమాణాలు అడుగంటుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో నూతన విద్యావిధానం సీయూల్లో పలు సంస్కరణలకు ఉపక్రమించడం శుభ పరిణామం. దానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నాందిగా భావించవచ్చు. ప్రమాణాలు మెరుగుపడితే విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. విదార్థులు వారి విద్యాసంవత్సరం పూర్తయ్యేలోపు మార్కెట్ అవసరాలకు సరిపడే నైపుణ్యాలను సాధిస్తారు.
దేశంలో మొత్తం 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి వర్సిటీ ఏటా 2,500 నుంచి 3,000 వరకు విద్యార్థులకు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి 41 వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 13 వర్సిటీలు కొత్తగా ఏర్పాటైనవి. భవిష్యత్తులో వాటినీ ఉమ్మడి పరీక్ష పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ విద్యకు క్యాట్, న్యాయ విద్యకు క్లాట్, ఇంజినీరింగ్కు గేట్... మాదిరిగానే ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూసెట్) వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కాబోతోంది.
ఆ సమస్య సీయూతో పరిష్కారం
ఇంటర్మీడియట్ సబ్జెక్టుల్లో మార్కులివ్వడంలో వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. మార్కుల ఆధారంగా జరిగే ప్రవేశాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో చేరాలంటే 98శాతం పైనే మార్కులు ఉండాలి. అది గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షే. సీయూసెట్ ఈ వ్యత్యాసాలను తగ్గిస్తుంది. అందరికీ సమానావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు వివిధ వర్సిటీల్లో కోర్సులకు దరఖాస్తు చేయాలంటే చాలా సమయం, డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు సీయూసెట్ ఒక చక్కని పరిష్కారం. ఒకే దరఖాస్తు విధానం విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. గ్రామీణ విద్యార్థులకు సీయూలు అందుబాటులోకి వస్తాయి. వర్సిటీలకు పరీక్షల నిర్వహణ వ్యయం, అధ్యాపకుల పని భారం తగ్గుతాయి. సీయూసెట్ మూల్యాంకనం కంప్యూటర్లలో పారదర్శకంగా జరుగుతుంది. కాబట్టి కచ్చితత్వం, జవాబుదారీతనం పెరుగుతాయి. సీయూసెట్ ద్వారా వర్సిటీలన్నింటి మధ్య సమన్వయం కుదిరే అవకాశం ఉంది. సమయానుకూలంగా వివిధ కొత్త కోర్సులు రూపొందించి, మెరుగైన మానవ వనరులు తయారు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని వర్సిటీల అధ్యాపకులు సమగ్రంగా చర్చించి ఆధునిక కోర్సుల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకొనే వీలుంది.