తూర్పు జెరూసలేంలో ఓ భాగమైన షేక్జరాలోని కొన్ని కుటుంబాలకు సంబంధించిన అద్దె చెల్లింపు వివాదం పెరిగి పెద్దదై ఇజ్రాయెల్-పాలస్తీనాలను కుదిపేస్తోంది. ఇరు దేశాల అంతర్గత రాజకీయాల్లోని ఆధిపత్యపోరు కూడా తోడై వివాదం ముదురుతోంది. అంతర్జాతీయ రాజకీయాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కొత్త సైనిక కూటముల ఏర్పాటు ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఫలితంగా ఈ ఘర్షణ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. జోర్డాన్ 1948లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం తరవాత షేక్జరా ప్రాంతంలో కొన్ని పాలస్తీనా శరణార్థి కుటుంబాలకు ఐరాస సహకారంతో నివాస ప్రాంగణాలను నిర్మించింది. కానీ, 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొంది.
1876లో ఒట్టొమాన్ చక్రవర్తి పరిపాలన కాలంలోనే తాము షేక్జరాలో అరబ్ల నుంచి కొనుగోలు చేసిన స్థలాల్లో జోర్డాన్ పాలస్తీనా శరణార్థులకు ఇళ్లను నిర్మించిందంటూ కొందరు యూదులు నాటి పత్రాలతో న్యాయస్థానాలను ఆశ్రయించారు. దిగువ న్యాయస్థానాల్లో యూదులకు అనుకూలంగా తీర్పు రావడంతో పాలస్తీనీయులు అద్దె చెల్లించడం లేదా ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేసు ఆ దేశ సుప్రీంకోర్టుకు చేరింది. మే నెల 10వ తేదీన దీనిపై తీర్పు వెలువడాల్సి ఉండటంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఫలితంగా న్యాయస్థానం మరో 30 రోజుల పాటు తీర్పును వాయిదా వేసింది.
పరిస్థితి జటిలం
వాస్తవానికి తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణలను అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు. దీంతో అక్కడ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పులు ఎలా చెల్లుతాయని పాలస్తీనా వర్గం ప్రశ్నిస్తోంది. రంజాన్ సందర్భంగా జెరూసలేంలోని డమాస్కస్ గేటు వద్ద ఎక్కువ మంది గుమిగూడితే ఉద్రిక్తత తలెత్తుందని అనుమానించిన ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల అమలులో ఘర్షణలు చెలరేగాయి. అల్లరి మూకలు దాక్కొన్నాయని చెబుతూ ఇజ్రాయెల్ దళాలు అల్అక్సా మసీదులోకి ప్రవేశించి అక్కడి వారిని చెదరగొట్టడంతో వివాదం జటిలమైపోయింది. దీంతో గాజాపట్టిలో హమాస్ ఉగ్రసంస్థ ఇజ్రాయెల్పై భారీగా రాకెట్ దాడులకు దిగడంతో ప్రతిదాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్లో నెతన్యాహు బలహీనపడినా, రెండేళ్లుగా ఏ పార్టీకీ సుస్థిర ఆధిక్యం దక్కలేదు. మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా ఇజ్రాయెల్ రెండేళ్లలో అయిదోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఘర్షణలను తనకు అనుకూలంగా మార్చుకొని తిరిగి బలం పుంజుకోవాలని నెతన్యాహు భారీ దాడులకు తెరతీశారు. మరోవైపు, పాలస్తీనా చట్టసభకు ఈ నెల 30న జరగాల్సిన ఎన్నికలను దేశ అధ్యక్షుడు, ఫతా పార్టీ అధినేత మహమ్మద్ అబ్బాస్ నిరవధికంగా వాయిదా వేశారు.