తెలంగాణ

telangana

కూరగాయల ధరలకు రెక్కలు- కారణం ఇదే!

దేశంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గడచిన పక్షం రోజుల్లోనే ఉత్తర భారతమంతటా కాలీఫ్లవర్‌, బఠాణీ, టొమాటో, ఆలు, ఉల్లిగడ్డల రేట్లకు రెక్కలు మొలిచాయి. పుణె నుంచి కోల్‌కతా వరకు, దిల్లీ మొదలు చెన్నై దాకా... ఎటు చూస్తే అటు తెగ్గోసుకుపోయిన సరఫరాలు ధరల్ని మోతెక్కిస్తున్నాయి. కొవిడ్​ మహమ్మారికి భారీ వర్షాలు తోడు కావడమే ఇందుకు కారణమా?

By

Published : Sep 17, 2020, 7:00 AM IST

Published : Sep 17, 2020, 7:00 AM IST

Special story on increasing price of vegetables due to heavy rains
కూరగాయల ధరలకు రెక్కలు- కారణం ఇదే!

సాధారణంగా వేసవిలో ఎండల ధాటితో పోటీపడే కాయగూరల ధరలు, వర్షాకాలంలో ఉపశమించడం పరిపాటి. కొవిడ్‌ మహా సంక్షోభవేళ వానలు జోరెత్తుతుండగా, తరతమ భేదాలతో దేశం నలుమూలలా కూరగాయల ధరవరలు భగ్గుమంటున్నాయి. గడచిన పక్షం రోజుల్లోనే ఉత్తర భారతమంతటా కాలీఫ్లవర్‌, బఠాణీ, టొమాటో, ఆలు, ఉల్లిగడ్డల రేట్లకు రెక్కలు మొలిచాయి. పుణె నుంచి కోల్‌కతా వరకు, దిల్లీ మొదలు చెన్నై దాకా... ఎటు చూస్తే అటు తెగ్గోసుకుపోయిన సరఫరాలు ధరల్ని మోతెక్కిస్తున్నాయి. కిలో బీన్స్‌ రూ.80, చిక్కుడు రూ.70దాకా పలుకుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆకుకూరల ధరలు సైతం మండిపోతున్నాయని సగటు వినియోగదారులు వాపోతున్నారు.

భారీ మూల్యం...

స్థానికంగా పండించే బీర, దొండ, కాకర, గోరుచిక్కుడు వంటి రకాలూ భారీ వర్షాలకు దెబ్బతినడంతో సరఫరా కుంగి గిరాకీ పెరిగిన పర్యవసానంగా- కూరగాయలు కొనబోతే కంట్లో కారం పడ్డట్లుగా విలవిల్లాడే దురవస్థ ప్రజానీకానికి దాపురించింది. వివిధ కారణాలవల్ల కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గి ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాలపై ఆధారపడ్డ భాగ్యనగరానికి- రవాణా కిరాయిలు, కూలీల రేట్ల తాకిడి ధరాఘాతాలు చవిచూపిస్తున్నాయి. కర్ణాటక లాంటిచోట్ల గిట్టుబాటు దక్కడంలేదన్న ఆవేదనతో రైతులే తమ పంటను పారబోస్తున్న, ఉచితంగా పంచేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. లోగడ గుజరాత్‌లో వేరుశనగ, హిమాచల్‌లో టొమాటో, పంజాబ్‌ హరియాణాల్లో ఆలు, తెలుగుగడ్డపైనే ఉల్లి దొండ తదితర సాగుదారులకూ అటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడూ రవాణా ఏర్పాట్లు సాధ్యపడక, కరోనా భీతితో కూలీలు దొరక్క తమ శ్రమంతా వృథా అయిందని వివిధ ప్రాంతాల రైతులు విలపిస్తుండగా- నిత్య జీవితావసరాల నిరంతర సరఫరా గొలుసు దెబ్బతిని వినియోగదారులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

అందుకే ఎగుమతులు నిలిపివేత...

ఇటీవలి దాకా వంద రూపాయలకు ఆరు కిలోలు వచ్చిన ఉల్లి ఇప్పుడు కిలో ఒక్కింటికి రూ.40 పలుకుతోంది. నిరుటిలాగే దేశీయ విపణిలో ఉల్లిపాయల రేట్లు మరింత ప్రజ్వరిల్లకుండా నియంత్రించేందుకంటూ కేంద్రం విదేశాలకు ఎగుమతుల్ని తాజాగా నిషేధించింది. వినియోగదారులకు కొంతైనా సాంత్వన ప్రసాదించే నిమిత్తం 50వేల టన్నుల బఫర్‌ నిల్వల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కథనాలు సూచిస్తున్నాయి. ఒక్క ఉల్లి అనేముంది- రకరకాల కూరగాయల్ని ఏడాది పొడుగునా సహేతుక ధరలకు అందుబాటులో ఉంచే పటిష్ఠ కార్యాచరణ తక్షణావసరం. పకడ్బందీ నిల్వ విధానం కొరవడి- దేశంలో పండించే పళ్లు, కాయగూరల్లో ఏటా 18శాతం దాకా వ్యర్థమవుతున్నాయని అంచనా. స్వల్ప వ్యవధిలో పాడైపోయే సేద్యోత్పత్తుల్ని పదిలపరచేందుకు అవసరమైన చోట తగినన్ని శీతల గిడ్డంగులు లేని కారణంగా దేశానికి వాటిల్లుతున్న వార్షిక నష్టం సుమారు రూ.92వేల కోట్లు!

గిడ్డంగులున్నా...

దేశవ్యాప్తంగా మూడుకోట్ల టన్నులకుపైగా సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులు అందుబాటులో ఉన్నట్లు నేతాగణం చెబుతున్నా, అందులో 75-80శాతందాకా ఆలుగడ్డల నిల్వకు ఉద్దేశించినవే కావడం ప్రణాళిక రచనలో, ప్రాథమ్య క్రమంలో దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను సూచిస్తోంది. దేశంలో ఎక్కడ ఏ పంట విరివిగా పండించగల వీలుందో పంచాయతీల ద్వారా నిర్దుష్ట సమాచారం రాబట్టి ఆ మేరకు సేద్య ప్రణాళిక కూర్పు, స్థానికావసరాలకు పోను ఇతర ప్రాంతాలకు నిల్వల తరలింపు, విదేశాలకు ఎగుమతులు- వీటన్నింటికీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల అర్థవంతమైన సమన్వయంతో విపుల కార్యాచరణ రూపుదిద్దుకోవాలి. దిగుబడుల పెంపుదలలో కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు క్రియాశీల భూమిక పోషించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుత్తేజిత సస్య భారతావని ఆవిష్కరణకు ఆ తరహా కృషి నాంది పలకాలి!

ఇదీ చూడండి:70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details