తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా కట్టడిలో స్వీయనియంత్రణే కీలకం

కరోనా రెండోదశలో ఉప్పెనల విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. గతేడాది​ విధించిన లాక్​డౌన్​ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అందుకే మళ్లీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని పాలకులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో పాటు ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

By

Published : Apr 26, 2021, 8:02 AM IST

Corona rules
కరోనా నిబంధనలు

మలివిడతలో కొవిడ్‌ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. కాలు బయటపెడితే కరోనా భూతం ఎక్కడ విరుచుకుపడుతుందోనన్న భయం సామాన్యుల్లో పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కేసులు నమోదవుతున్నా, 'లాక్‌డౌన్‌' వంటి ఆంక్షల వైపు పాలకులు మొగ్గుచూపలేకపోతున్నారు. రెండోదశలో రోజూ నమోదవుతున్న కేసుల్లో దాదాపు నాలుగోవంతు మహారాష్ట్రలోనే వస్తున్నాయి. గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ కుప్పకూలింది. రాష్ట్రాలు ఆదాయం లేక అల్లాడిపోయాయి.

అందుకే ఈసారి మళ్లీ లాక్‌డౌన్‌ విధించేవరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. కానీ మహారాష్ట్రలో పరిస్థితి మరీ విషమిస్తుండటంతో కఠిన ఆంక్షలు విధించక తప్పలేదంటూనే.. కొన్ని సడలింపులను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయిదు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టి ఉండొచ్చు గానీ- హైకోర్టు ఆదేశాలు ఆ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అలాగని కేవలం మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లే కాదు- యావద్దేశం కరోనా కోరలమధ్య విలవిల్లాడుతోంది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం వైరస్‌ బాధితుల బంధువులు నిరీక్షిస్తున్నారు.

కరోనా కోరల్లో రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఆస్పత్రులలో కరోనా పడకలు దొరకడం దాదాపు దుర్లభంగానే కనిపిస్తోంది. తొలి దశలో భారీస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో రోగుల సంఖ్య ఎంత ఎక్కువగా వచ్చినా- వారిలో ఆస్పత్రుల్లో చేర్చాల్సిన వారందరికీ పడకలు చూపించగలిగాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ రెండోదశ పరిస్థితి అలా లేదు. ఒకవైపు అతి తక్కువ వ్యవధిలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో కేసులు పెరిగిపోతుండగా, ప్రభుత్వాలు చేస్తున్న ఏర్పాట్లు ఏ మూలకూ సరిపోవడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయేవరకూ ఊరుకుని అప్పుడు ఆస్పత్రిలో చేరాలని ప్రయత్నించడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం పాజిటివ్‌ వచ్చినవారు చాలావరకూ టెలి కన్సల్టేషన్లు తీసుకోవడం, ఆరోగ్యంపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆస్పత్రిలో చేరడం ద్వారా త్వరగా కోలుకోగలిగారు. ఇప్పుడా టెలివైద్యం ఊసే వినిపించడం లేదు.

ఆ వెసులుబాటే కారణమా?

ఆస్పత్రుల్లోని కరోనా పడకలు కొత్త కేసులకు సరిపోయే స్థాయిలో లేవు. తెలంగాణలో రోజూ నాలుగంకెల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రోజువారీ కేసులు అయిదంకెలకు చేరుకున్నాయి. అయినా ఇప్పటికీ వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలూ లేవు. వారపు సంతల్లో రద్దీ తగ్గడం లేదు. ఆస్పత్రుల్లో వైరస్‌ పరీక్షలకు అనుమానిత లక్షణాలతో వెళ్లేవారిని- భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా సిబ్బంది నియంత్రించడంలేదు. దాంతో ఒకరిని ఒకరు తోసుకుని వెళ్తున్న పరిస్థితి కళ్లకు కడుతోంది.

టీకాలు వేయించుకునే సందర్భంలోనూ కొవిడ్‌ నిబంధనలకు నీళ్లొదులుతున్న ఉదంతాలు నిత్యం కనిపించడం దురదృష్టకరం. పలు ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వీయ ఆంక్షలను విధించుకుంటుండగా- కొన్ని పట్టణాలు, నగరాల్లో అధికారులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లవారే వరకూ దుకాణాలను మూసి ఉంచాలని, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రాకూడదని చెబుతున్నారు. అది కొంతలో కొంత రద్దీని తగ్గిస్తున్న మాట వాస్తవమే అయినా- పగలు లభించిన వెసులుబాటు కరోనా కేసుల విజృంభణకు ప్రధాన కారణం అవుతోంది.

స్వీయ నియంత్రణ అవసరం

ఇలాంటి తరుణంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే మాస్కులు ధరించడం, ఇతరుల నుంచి తగినంత దూరాన్ని పాటించడం, చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వంటివి తప్పనిసరిగా అమలుచేయాలి. కళ్లు, ముక్కు, నోరు లాంటి శరీరభాగాలను ముట్టుకునేముందు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నింటినీ ఎవరికి వారు పాటించాల్సిందే. కరోనా వైరస్‌ ప్రారంభంలో అమలైన స్థాయిలో సైతం ఇప్పుడీ నిబంధనలేవీ అమలు కాకపోవడం ఆశ్చర్యకరం. యంత్రాంగాలూ ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి.

45 ఏళ్లు దాటినవారందరికీ ఇప్పటికే టీకా ఇస్తుండగా, మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికీ ఆ అవకాశం లభిస్తుంది. కరోనా సోకకుండా టీకా పూర్తిగా అడ్డుకోకపోయినా... వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వైద్యనిపుణులు ఘంటాపథంగా చెబుతున్న మాట. ఇలా ఎవరికి వారు స్వీయజాగ్రత్తలన్నీ పాటిస్తే మహమ్మారి నుంచి రక్షణ లభించే అవకాశం ఉంటుంది. గాలిలోను, దుమ్ములోనూ కరోనా వైరస్‌ దాగి ఉంటుందని పరిశోధకులు చెబుతున్న నేపథ్యంలో ఎవరికి వారే అప్రమత్తంగా ఉండి తీరాలి.

రచయిత- కామేశ్వరరావు పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details