విస్తరణ కాంక్షకు అంతులేదని చైనా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. భారత్ సరిహద్దులో వివాదాలు సృష్టించిన చైనా.. ప్రస్తుతం పరోక్షంగా కుట్రలు పన్నుతోంది. భారత్తో సన్నిహిత సంబంధాలున్న భూటాన్ను తనతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పర్చుకునేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఇటీవల సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్యాన్ని వివాదాస్పద ప్రాంతంగా పేర్కొనడం సైతం భూటాన్పై ఒత్తిడి తీసుకురావడానికేనని నిపుణులు చెబుతున్నారు. తద్వారా భారత్-భూటాన్ మైత్రిని పరీక్షించనున్నట్లు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి-భూటాన్ మాదేనంటూ చైనా కొత్త కుట్రలు
ఈ నేపథ్యంలోనే భూటాన్తో సరిహద్దు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్విన్ మంగళవారం(జులై 21న) పేర్కొన్నారు. దీనికోసం భూటాన్కు ప్యాకేజ్ డీల్ ఆఫర్ చేసినట్లు తెలిపారు.
"చైనా స్థానం స్పష్టంగా, స్థిరంగా ఉంది. చైనా, భూటాన్ మధ్య సరిహద్దును ఇంకా నిర్ణయించలేదు. తూర్పు, పశ్చిమ సరిహద్దులు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ వివాదాలకు చైనా పరిష్కారాన్ని ప్రతిపాదించింది. బహుపాక్షిక వేదికలపై ఇలాంటి వివాదాల ప్రస్తావనను చైనా వ్యతిరేకిస్తోంది. సమస్యపై సంబంధిత పక్షాలతో చైనా సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది."
-వాంగ్ వెన్విన్, చైనా విదేశాంగ ప్రతినిధి
సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్య అభివృద్ధికి చైనా ఎందుకు అభ్యంతరం చెబుతోందన్న ప్రశ్నకు వాంగ్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్) నిధులతో అభయారణ్యం అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. 183 దేశాల భాగస్వామ్యంతో అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజాలు, ప్రైవేట్ సెక్టార్ సమన్వయంతో పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధి ఏర్పాటు చేశారు. కానీ వివాదాస్పద ప్రదేశమని చెబుతూ ఈ అభివృద్ధి పనులకు మోకాలడ్డింది డ్రాగన్.
అసలు సరిహద్దులోనే లేదు
అసలు చైనా అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లో కూడా లేని ఈ ప్రాంతంపై ఆ దేశం హక్కులు ప్రకటించుకునేందుకు ప్రయత్నించడమే ఇప్పుడు పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఈ ప్రాంతం భారత్, భూటాన్ సరిహద్దులో ఉంది. వాస్తవాదీన రేఖ వద్ద భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరగడం కూడా అనుమానాస్పదంగా మారింది. భారత్కు వ్యతిరేకంగానే ఇవన్నీ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సమస్య ఏంటి?
భూటాన్ తూర్పు సరిహద్దు సమీపంలో సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇది భారత్లోని అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర్లో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చైనా తన భూభాగంలో భాగమని చెప్పుకుంటోంది. దీన్ని దక్షిణ టిబెట్గా పరిగణిస్తోంది.
భూటాన్, చైనా మధ్య అధికారిక దౌత్యపరమైన సంబంధాలేవీ లేవు. 1951లో టిబెట్ను చైనా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇరువురు పొరుగుదేశాలుగా మారాయి. 1984 నుంచి సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య 24 దఫాల చర్చలు జరిగాయి.
ఇదీ చదవండి-చైనా 'ఇరాన్' తంత్రం.. ఎందుకీ దోస్తీ?