తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'సైనిక ఉపసంహరణే... ఉద్రిక్తతలకు ముగింపు కాదు'

లద్దాఖ్​లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారత్​- చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. దీని అర్థం ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గినట్లు కాదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సైనికుల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని హింసాత్మక ఘటనలు తలెత్తకుండా ఈ ప్రక్రియ చేపడతారని తెలిపారు.

By

Published : Jul 9, 2020, 6:26 PM IST

Pullback 'token' in east Ladakh to rein in 'hot tempers' on both sides, no de-escalation yet
'సైనిక ఉపసంహరణ మాత్రమే- ఉద్రిక్తతలు తగ్గినట్లు కాదు'

భారత్​, చైనా మధ్య అత్యున్నత స్థాయి సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాత సరిహద్దులో సైనిక బలగాల ఉపసంహరణ జరిగింది. ఎదురెదురుగా ఉన్న ఇరుదేశాల సైనికులు స్వల్పంగా వెనక్కి తగ్గారు. ఘర్షణాత్మక ప్రాంతాలైన గల్వాన్ లోయ(పెట్రోల్ పాయింట్-14), పాంగొంగ్ సరస్సు(ఫింగర్ 4), హాట్ స్ప్రింగ్స్(పెట్రోల్ పాయింట్-15) గోగ్రా(పీపీ 17)ల నుంచి సైన్యాన్ని ఇరుదేశాలు రెండు కిలోమీటర్లు వెనక్కి తరలించాయి.

అయితే దీని అర్థం ఉద్రిక్తతలు సమసిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని 'టోకెన్​ మూమెంట్లు'గా పరిగణిస్తారని తెలిపారు. సైన్యాల మధ్య దూరం పెంచేందుకు ఇలా చేస్తారని వివరించారు.

"ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గించడానికి చాలా సమయం పడుతుంది. రెండు వైపులా సైనికులు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి హింసాత్మక ఘటనలను నివారించడానికి పరస్పర అంగీకారం ప్రకారం ఉపసంహరణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్​-చైనా సైన్యాలు తమ బలగాలను వెనక్కి తీసుకోవాలి. ఇరుపక్షాలు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ఇదే ఇప్పుడు ప్రధాన ఉద్దేశం."

-సంబంధిత వర్గాలు

రెండు దేశాలకు చెందిన లక్ష మందికిపైగా సైన్యం వాస్తవాధీన రేఖ సమీపంలో మోహరించి ఉన్నాయి. వెనువెంటనే సరిహద్దుకు చేరుకునే విధంగా భారీ ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో సిద్ధంగా ఉన్నాయి. సైన్యం, వాయుసేన​ అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఇరుదేశ సైన్యాలకు తెలుసు.

దీంతోపాటు భారీగా సైన్యాన్ని సమీకరించుకోవడానికి ఇరుదేశాలు చాలా ప్రయత్నాలు చేశాయి. పరిస్థితులకు అలవాటుపడి, పెద్ద ఎత్తున బలగాలను- ఆయుధాలను తరలించి, సులభంగా నాశనం చేసే వీలులేని రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

చలి- పులి

అయితే ఈ ఏర్పాట్లను కొనసాగించడానికి తగిన సమయం లేదు. మరో మూడు నెలల్లో ఈ ఎత్తైన ప్రాంతంలో ఎముకలు కొరికే చల్లని వాతావరణం ఏర్పడుతుంది. భారీగా మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకన్నా తక్కువకు పడిపోతాయి. తీవ్రమైన హిమ గాలులు వీస్తాయి. ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. ఈ ప్రమాదకరమైన ప్రతికూలతలను ఇరుదేశాల సైనికులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వేసవి కాలంలో ఎత్తైన ప్రదేశాల్లో తలపడటం సులభం. కానీ ఇలాంటి చలికాలంలో సుదీర్ఘ కాలం పాటు మనుగడ సాధించడం కష్టతరమవుతుంది. 'సుదీర్ఘ కాలంపాటు ఇక్కడ మోహరింపులు చేపడితే చాలా అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం ఇలా ఉండటం వల్ల యుద్ధ అలసటకు దారితీస్తుంది' అని ఈ ప్రాంతంలో పనిచేసిన సీనియర్ సైనిక అధికారి పేర్కొన్నారు.

సముద్ర మట్టానికి 4 వేల నుంచి 6,500 మీటర్ల ఎత్తులో కారకోరం వరకు ఈ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. కారకోరం పక్కనే ప్రపంచంలోని అతి ఎత్తైన యుద్ధ భూమి 'సియాచిన్' హిమానీనదం ఉంది. మొత్తం మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతాల్లో గాలి పీల్చుకోవడానికి కూడా తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. అలసట, తేలికపాటి తలనొప్పి, మెదడు దెబ్బతినడం, ఊపిరితిత్తుల వాపు, నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి సాధారణ వ్యాధులతో పాటు క్లినికల్ డిప్రెషన్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

(రచయిత-సంజీవ్ బారువా, సీనియర్ జర్నలిస్ట్)

ఇదీ చదవండి-వెనక్కి వెళ్లిన చైనా బలగాలు- శుక్రవారం మళ్లీ చర్చలు

ABOUT THE AUTHOR

...view details