'విదేశీ భాషా పునాదులపై ఏ దేశమూ సమున్నతంగా ఎదగలేదు' అని హెచ్చరించిన ప్రథమ ప్రధాని నెహ్రూ- భారతీయ భాషలతోనే సామాజిక సమతులాభివృద్ధిని సాధించగలమని స్పష్టీకరించారు. విజ్ఞాన పరిధులను విస్తరించుకుంటూ పరిశోధనల్లో యువతరం తేజరిల్లాలంటే అన్ని స్థాయుల్లోనూ ప్రాంతీయ భాషల్లో బోధన కీలకమని డాక్టర్ సర్వేపల్లి సారథ్యంలోని 'విశ్వవిద్యాలయ విద్యాసంఘం' సభ్యులు 1949లోనే సిఫార్సు చేశారు. స్వతంత్ర భారతి తొలివేకువలోనే పల్లవించిన ఈ ఆలోచనలకు ఆచరణ రూపమివ్వడంలో దశాబ్దాలుగా జాప్యం జరుగుతోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనను సత్వరం పట్టాలెక్కించాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపిచ్చారు. వంద మంది సాంకేతిక విద్యాసంస్థల సంచాలకులతో వర్చువల్ భేటీలో ఆయన ఈ మేరకు పథనిర్దేశం చేశారు. అంతరాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే విద్యావిధానానికి సార్థక్యమన్న ప్రధాని- ఉన్నత, సాంకేతిక విద్యారంగంలో భారతీయ భాషల వినియోగం ఇనుమడించాలని కొన్నాళ్లుగా ఉద్ఘాటిస్తూనే ఉన్నారు.
ఆర్నెల్లం క్రితమే..
వైద్య, న్యాయ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించడంపై మార్గసూచి రూపకల్పనకు ఆర్నెల్ల క్రితమే అమిత్ ఖరే నేతృత్వంలో కేంద్రం ప్రత్యేక కార్యదళాన్ని కొలువుతీర్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఎంపిక చేసిన ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో స్థానిక భాషల్లో బోధన ప్రారంభిస్తామని ప్రకటించింది. తియ్యందనాల తెలుగుతో సహా ఎనిమిది భారతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు ఇటీవలే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. నిరుడు ఆ సంస్థ నిర్వహించిన దేశవ్యాప్త అధ్యయనంలో దాదాపు 44 శాతం ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంతీయ భాషలనే బోధనా మాధ్యమాలుగా ఎంచుకోవడం- ఎన్నదగిన మార్పును కళ్లకు కడుతోంది. పరాయి భాషలో ప్రావీణ్యమే పెద్ద పరీక్షగా మారిన దుస్థితిలో ఉన్నత విద్యకు దూరమవుతున్న కోట్లాది ప్రజ్ఞావంతుల ఆశలు ఆకాంక్షలు ఈడేరాలంటే- స్థానిక భాషా మాధ్యమాల్లో వృత్తివిద్యా కోర్సుల అందుబాటు ఊపందుకోవాలి.