'అకస్మాత్తుగా ఈ జనాభా గోలేమిటి? దేశంలో ఎక్కడా లేనట్లుగా రెండు రాష్ట్రాల్లోనే జనాభా ఎక్కువైపోతోందా? అడ్డగోలుగా పెరిగిపోతున్న జనసంఖ్యను అర్జంటుగా అరికట్టేస్తామంటూ నేతలు ఊగిపోతున్నారు. ఏమిటీ కథ?'
'నేతలు చేసే ప్రతి పనికీ ఓ లెక్కుంటుంది. ఏ మతలబూ లేనిదే నేతాశ్రీలు ఏ సమస్యనూ ముందుకు తీసుకురారు, ఏ పనికీ ముందుకురారు! ఎక్కడో అటకపైకి చేరిన ఒక విషయాన్ని తాజాగా బయటికి తీసి, జనం మధ్యలో పడేసి, నలుగురిలో నానేలా చేసి, పదిమందీ వంద రకాలుగా మాట్లాడుకునేలా అటూఇటూ మార్చి, చివరికి ఎటూ తేల్చకుండా విడిచిపెట్టడమే రాజకీయం. ఇలాంటప్పుడే ఔత్సాహిక నేతలంతా ఉత్సాహంగా ముందుకొచ్చి, తలా ఒకలా మాట్లాడటంతో, విషయం వివాదంగా మారిపోతుంది. అందుకే ఏ దేశంలోనైనా పనికొచ్చే విషయాలకన్నా, అక్కరకురాని వాటిపైనే ఎక్కువ రాద్ధాంతం జరుగుతుంటుంది. తాజాగా బయటికి వచ్చిన జనాభా నియంత్రణ విషయాలపై అందరూ తలా ఒక మాట మాట్లాడేసి, విషయాన్ని అటూఇటూ పీకి పాకం చేసేశారు. పిల్లల్ని కనడానికి, చదువులకు ముడిపెట్టాశారొక నేత. మన దేశంలో చదువుకున్న వారికి ఇద్దరు ముగ్గురికి మించి సంతానం లేరంటూ దిగ్విజయ్ సింగ్ సిద్ధాంతీకరించేశారు. పేదరికాన్ని పారదోలి, అందరికీ చదువు చెబితే జనాభా తగ్గిపోతుందని సెలవిచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే, అసలు విషయాలు పక్కకెళ్లి, ఇంకేవో వచ్చి చేరుతుంటాయి. రాజకీయ నేతలు తమ సంతానం వివరాలు ప్రకటించాల్సిందేనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ డిమాండు చేయడం అలాంటిదే. యూపీ మంత్రులకు చట్టబద్ధమైన సంతానం ఎంతమంది, చట్టబద్ధంకాని వారెంతమంది ఉన్నారో చెప్పాలంటూ విచిత్రమైన సవాల్ విసిరి వివాదానికి కొత్తకోణం తొడిగారు'
జనాభా అరికట్టడం ఇప్పుడే ఎందుకు?
'అదేమిటి... సంతానంలో అధికారికం, అనధికారికమంటూ ఉంటాయా? ఆస్తిఅప్పుల పట్టికలా సంతానాన్నీ అటూఇటూగా వేర్వేరుగా ప్రకటిస్తారా ఏమిటి? అస్సలు... ఆస్తులు, కేసులు, చదువులను బయటకు చెప్పడానికే నానా వేషాలు వేసి, గుటకలు మింగే నేతాగ్రగణ్యులు సంతానం సమాచారాన్ని, వారసుల వివరాల్ని ముందుగానే బయటపెడితే, కొంపలంటుకుపోవూ? గాలికి పోయే కంపను కాలి కింద వేసుకోవడమంటే ఇదే! అత్యుత్సాహం అవధులు మించితే అడ్డంగా ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అసలు జనాభా అరికట్టే అవసరం, అత్యవసరం... ఇప్పుడే ఎందుకు ముందుకొచ్చినట్లు?'
ఎన్నికల ఎత్తుగడలే!
'మాయావతికీ సరిగ్గా ఇలాంటి అనుమానమే వచ్చింది. జనాభాను నియంత్రించాలనే సదుద్దేశమే ఉంటే, యూపీ ప్రభుత్వం ముందునుంచే ఇలాంటి పనేదో మొదలు పెట్టాలి కదా, ఇప్పుడే ఎందుకు తలకెత్తుకున్నట్లు అంటున్నారామె. ఇవన్నీ ఎన్నికల ఎత్తుగడలే అన్నది ఆమె సందేహం. ఇదంతా ఎన్నికల ముందు ప్రచారంగా సమాజ్వాదీ పార్టీ కూడా తేల్చిచెబుతోంది. అప్పట్లో ఇందిరాగాంధీ 'మేమిద్దరం, మాకిద్దరు' నినాదాన్ని తీసుకొస్తే వ్యతిరేకించి, అమలు కాకుండా అడ్డుకున్నారని, ఎన్నికల నినాదంగా ఉపయోగించుకొన్నారంటూ రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి ఒకరు ఆక్షేపించారు. సరే, ప్రత్యర్థి పార్టీలన్నీ ఎన్నికల కోణంలోనే వ్యతిరేకించారనుకున్నా... అస్సలు చట్టాల ద్వారా జనాభాను నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదంటూ మిత్రపక్షం నేత నితీశ్ సైతం పెదవి విరిచారు. మహిళలకు అవగాహన కల్పించడం ఒక్కటే జనాభా నియంత్రణకు మేలైన మార్గమని తేల్చిచెప్పారు. సంతానం తగ్గించే భారాన్ని మొత్తంగా మహిళలపై వేసి చేతులు దులిపేసుకున్నారు.'
లాభమా?