ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించడంలో, సేవలను అందించడంలో స్థానిక సంస్థల పాత్ర ఎనలేనిది. అందుకు సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన పాలనా యంత్రాంగం, ప్రణాళిక వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి అనేది ఉత్తుత్తి నినాదం కాకుండా సువ్యవస్థిత విధానం అవుతుంది. రాజ్యాంగంలోని అధికరణ 243జి ప్రకారం గ్రామ పంచాయతీలు తమ పరిధిలోని ప్రజల ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయసాధన కోసం తప్పనిసరిగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. ప్రజా భాగస్వామ్య పద్ధతిలో రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ లోని 29 అంశాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలను సమన్వయం చేసుకుని, విస్తారమైన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి.
సబ్ కీ యోజనా సబ్ కా వికాస్
ప్రజలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నిర్ణయాలలో పాలుపంచు కోవడంతోపాటు పథకాల ప్రాధాన్యాల్ని నిర్ణయించడంలో, విధాన రూపకల్పనలో, వనరుల కేటాయింపులో వారిని భాగ స్వాములను చేసే విధానమే భాగస్వామ్య ప్రణాళిక. అక్టోబర్ 2, 2020 నుంచి జనవరి 31, 2021 వరకు సబ్ కీ యోజనా సబ్ కా వికాస్ (అందరి ప్రణాళిక అందరి అభివృద్ధి) కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించాలి. అందుకు గ్రామసభలు నిర్వహించి, పంచాయతీరాజ్ సంస్థలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో, నిర్దిష్ట కార్యాచరణతో 2021-22 సంవత్సరానికి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. గ్రామసభలో ఆమోదించిన ప్రణాళిక వివరాలను ఇ-గ్రామస్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలి. అలాగే గ్రామ పంచాయతీలలో మిషన్ అంత్యోదయ సర్వే నిర్వహించి, సమాచారం సేకరించి, నమోదు చేయాలి. దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, 5.25 కోట్ల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. వీరందరినీ ప్రణాళికలో భాగస్వాములను చేసి వారి పాత్రను బలోపేతం చేయడం కూడా దీని ముఖ్య ఉద్దేశం.
మౌలిక సదుపాయాలే కీలకం..
ప్రణాళిక రూపకల్పనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ, 13 కీలకమైన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. గ్రామాల సమగ్రాభివృద్ధికి ఆయా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పాటు, గ్రామస్థాయి ఉద్యోగుల సమన్వయం ఎంతో కీలకం. అందుకు కీలకమైన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం. రైతుల సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, పాఠశాల విద్య అక్షరాస్యత, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం సామాజిక న్యాయం- సాధికారతా శాఖల లాంటి సుమారు 16 విభాగాల సమన్వ యంతో ప్రణాళికలను రూపొందించాల్సి ఉం టుంది. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా గ్రామసభకు హాజరై తమ శాఖ కార్యకలాపాలను వివరించాలి. ప్రజల భాగస్వామ్యంతో, జవాబుదారీతనం, నిధుల సక్రమ వినియోగం, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, గ్రామ పంచాయతీల పట్ల ప్రజలకు నమ్మకం కలిగి సమగ్ర ప్రణాళికలు రూపొందుతాయి.