తెలంగాణ

telangana

ETV Bharat / opinion

న్యాయ సంస్కరణలు ఎండమావేనా?

భారత న్యాయవ్యవస్థలో సత్వర న్యాయం అనేది అందని ద్రాక్ష అనే విమర్శ తరచూ వినపడుతుంటుంది. సత్వర న్యాయం మాట అటుంచితే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు తమ జీవిత కాలంలోనే న్యాయం పొందగలుగుతామా? అనే ప్రశ్న కక్షిదారులకు కలుగుతోంది. ఈ వ్యవస్థలో మార్పులు చేస్తే కానీ ఈ పరిస్థితిలో మార్పు రాదని మాజీ న్యాయమూర్తులే అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ న్యాయసంస్కరణలు చేపట్టడం ఆచరణలోకి ఎప్పుడొస్తుంది?

By

Published : Dec 21, 2020, 9:31 AM IST

reforms in judicial system
న్యాయసంస్కరణలు ఎండమావేనా?

దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ పరికల్పనకు రాజ్యాంగమే పూచీపడి ఏడు దశాబ్దాలు గడిచినా- ఎండమావి న్యాయాన్ని అందుకోలేక జనావళి గుండెలవిసి పోతున్నాయి. వ్యాజ్యాలు నిజం- న్యాయం మిథ్యగా పరిస్థితులు విషమించడానికి- కర్ణుడి చావుకంటే ఎక్కువ కారణాలు పోగుపడ్డాయి. సుప్రీం న్యాయపాలిక సహా దేశవ్యాప్తంగా పాతిక హైకోర్టుల్లో న్యాయపీఠాలు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోవడం వాటిలో కీలకమైనది. ఈ నెల ఒకటో తేదీ నాటికి సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టుల్లో 1074 జడ్జి పోస్టులకు గాను 414 ఖాళీలు భర్తీకాకుండా ఉన్నాయి. జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో 24,225 మందికిగాను, 19,345 మందే విధుల్లో ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. ప్రతి హైకోర్టు న్యాయమూర్తి సగటున తలసరి నాలుగున్నర వేలు; సబార్డినేట్‌ కోర్టులో ప్రతి జడ్జి సగటున 1300 పెండింగ్‌ వ్యాజ్యాలతో కుస్తీ పట్టాల్సి వస్తోందని కేంద్ర న్యాయశాఖ చెబుతోంది.

మూడు కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్...

ఈ ఏడాది తొలి నాటికి తెలంగాణ హైకోర్టులో అపరిష్కృత పిటిషన్ల సంఖ్య రెండు లక్షల ఆరువేలు; నవంబరు నాటికవి మరో పద్నాలుగు వేలు పెరిగాయంటూ ఎకాయెకి 11 న్యాయ పీఠాలు ఖాళీగా ఉండటంతో సత్వర న్యాయం మరీచికని తలపిస్తోందని ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాంగంలోని 224-ఎ అధికరణ అనుసారం ప్రధాన న్యాయమూర్తులు- రాష్ట్రపతి ఆమోదంతో విశ్రాంత న్యాయమూర్తుల సేవల్ని వినియోగించుకోగల వీలుందని, ఆ దిశగా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరుతున్నారు. నిశితంగా చూస్తే, ఇది కేవలం తెలంగాణ సమస్య కాదు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉండగా, ఏటా కొత్తగా మరో రెండు కోట్లు దాఖలు అవుతుంటాయని, పెండింగ్‌ కొండల్ని కరిగించడానికి 320 ఏళ్లు పడుతుందని జస్టిస్‌ వీవీరావు స్పష్టీకరించి పదేళ్లయింది. న్యాయసంక్షోభం ఇంతగా ముదిరినా తీరైన కార్యాచరణే కొరవడింది!

70వేల మంది జడ్డిలు అవసరం..

న్యాయస్థానాలపై మోయలేని భారం పడుతోందని 2016 నాటి ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో దుఃఖవిచలితులైన నాటి భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ పెండింగ్‌ కేసుల భారాన్ని వదిలించాలంటే 70 వేల మంది జడ్జీల అవసరం ఉందని ప్రకటించారు. పది లక్షల మంది జనావళికి 50 మంది న్యాయమూర్తులన్న ఆదర్శప్రాయ నిష్పత్తిని న్యాయసంఘం ప్రస్తావించిన నేపథ్యంలో ప్రస్తుతం అది 17గా ఉన్న వాస్తవాన్ని విస్మరించే వీల్లేదు. అందులోనూ మంజూరైన పోస్టుల్లో మూడింట రెండొంతుల కన్నా తక్కువ మంది న్యాయమూర్తులతోనే 12 హైకోర్టులు పని చేస్తున్నాయని వాటిలోనూ పట్నా, రాజస్థాన్‌, కోల్‌కతా హైకోర్టుల్లో ఖాళీలు 50 శాతంపైగానే ఉన్నాయని అధ్యయనాలు చాటుతున్నాయి. హైకోర్టుల్లో ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదని నిర్దిష్ట కాలావధిలోగా హైకోర్టు కొలీజియాల నుంచి ప్రతిపాదనలు అందడం లేదని ఇటీవల అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకే నివేదించారు.

మార్పు ఎప్పుడు...

మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన న్యాయ నియామకాల జాతీయ సంఘం చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను సుప్రీం ధర్మాసనం 2015 అక్టోబరులో కొట్టేసిన దరిమిలా- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కాలానుగుణ సంస్కరణలకు, అందివచ్చిన సాంకేతికతను అనుసంధానించి దర్యాప్తు, విచారణల్లో వేగాన్ని పెంచి కక్షిదారుల కన్నీళ్లు సత్వరం తుడిచే న్యాయప్రక్రియ- పాశ్చాత్య దేశాల ప్రగతికి తన వంతు చేయూతనిస్తోంది. అదే ఇక్కడ జోడెడ్ల బండి కాలంనాటి వ్యవస్థ, న్యాయ నియామకాలకూ పెండింగ్‌ జాడ్యం సోకిన దురవస్థ నడుమ దశాబ్దాలుగా నలిగిపోతున్న సగటు పౌరుడి సూటి ప్రశ్న- న్యాయసంస్కరణలు ఎండమావేనా?

ఇదీ చూడిండి :'కేసుల పరిష్కారానికి ఇదో చక్కని అవకాశం'

ABOUT THE AUTHOR

...view details